వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల కాంగ్రెస్‌లో చేరబోతున్నారనే వార్తలు వచ్చిన తరుణంలో బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. షర్మిల అన్న వదిలిన బాణం కాదని, అన్న వదిలేసిన బాణం అని అన్నారు. ఆమె తిరిగి ఏపీకి రాబోతుందని జోస్యం చెప్పారు. ఏపీ కాంగ్రెస్ పగ్గాలు ఆమెకు అప్పజెబితే జగన్ పని అయిపోయినట్టేనని పేర్కొన్నారు. 

అమరావతి: వైఎస్సార్టీపీ చీఫ్ షర్మిల రెడ్డి చుట్టూ ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్‌లోని రాజకీయంగా చర్చ జరుగుతున్నది. కాంగ్రెస్‌లో వైఎస్సార్టీపి విలీనం చేస్తున్నారనే వార్తలు రాగానే.. టీపీసీసీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తూ విమర్శించారు. అయితే, నిజంగానే ఆమె కాంగ్రెస్ అదిష్టానంతో టచ్‌లో ఉన్నారని మాణిక్ రావు ఠాక్రే తెలుపగానే టీపీసీసీ ప్రస్తుతానికైతే సైలెంట్ అయింది. కానీ, ఏపీలో ఈ ప్రకంపనలు మొదలయ్యాయి.

కాంగ్రెస్ పార్టీలో షర్మిల చేరుతారనే వార్తలపై బీజేపీ నేత ఆదినారాయణ రెడ్డి రియాక్ట్ అయ్యారు. షర్మిల కాంగ్రెస్‌లో చేరుతారనేది దాదాపు స్పష్టంగా తెలుస్తున్నదని ఆయన అన్నారు. ఒక వేళ ఆమెకు ఏపీ కాంగ్రెస్ పగ్గాలు అప్పజెబితే మాత్రం ఇక్కడ సీఎం జగన్ మోహన్ పని అయిపోయినట్టే అని పేర్కొన్నారు.

Also Read: JP Nadda: బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ.. ఎలాంటి కాంప్రమైజ్ లేదు: జేపీ నడ్డా

షర్మిల అన్న వదిలిన బాణం కాదని, అన్న వదిలేసిన బాణం అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. ఈ బాణమే రాబోయే రోజుల్లోకి ఆంధ్రప్రదేశ్‌కు తిరుగుపయాణం అవుతుందని అన్నారు.