తెలంగాణలో అధికార బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ మెతక వైఖరి అనుసరిస్తున్నదనే ఆరోపణలకు జేపీ నడ్డా స్పష్టత ఇచ్చారు. అలాంటిదేమీ లేదని, బీఆర్ఎస్‌తో కాంప్రమైజ్ లేనే లేదని స్పష్టం చేశారు. సీరియస్ ఫైట్ చేయాల్సిందేనని రాష్ట్ర నేతలకు దిశా నిర్దేశం చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ రాష్ట్ర విభాగంలో జోరు పెంచాలని, ఇది వరకే నెలకొన్ని కొన్ని సంశయాలను పటాపంచలు చేయడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌కు వచ్చారు. మరికాసేపట్లో నాగర్ కర్నూల్‌లో బీజేపీ నిర్వహిస్తున్న నవ సంకల్ప సభలో మాట్లాడనున్నారు. ఈ సభకు ముందే ఆయన రాష్ట్ర నేతలతో సమావేశమై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకోగా.. రాష్ట్ర బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి జేపీ నడ్డా నేరుగా నోవాటెల్ హోటల్‌కు వెళ్లారు. హొటల్‌లో బీజేపీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు.

Also Read: ఢిల్లీలోనే ఈటల, రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నేడు చేయబోయే జేపీ నడ్డా ప్రసంగంపై ఫోకస్

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మరికొందరు ముఖ్య నేతలు రఘునందన్ రావు, విజయశాంతి, పొంగులేటి సుధాకర్ రెడ్డి సహా పలువురు ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిస్థితులు, పరిణామాలపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. అధికార పార్టీ బీఆర్ఎస్‌తో పాటించాల్సిన వైఖరి గురించి కూడా ఆయన స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌తో ఎలాంటి రాజీ లేదని స్పష్టం చేశారు. బీఆర్ఎస్‌తో సీరియస్‌గా పోరాటమేనని నిర్దేశించి నట్టు తెలిసింది.