YS Sharmila: షర్మిల కాంగ్రెస్లో చేరితే.. మేం అలానే చూస్తాం: మంత్రి పెద్దిరెడ్డి
షర్మిల కాంగ్రెస్లో చేరడంపై మంత్రి పెద్దిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీని, జగన్కు వ్యతిరేకంగా పని చేసే వారిని తాము ప్రతిపక్షంగానే చూస్తామని వివరించారు. షర్మిల కూడా ఇందుకు మినహాయింపు కాదని స్పష్టం చేశారు.
![ys sharmila reddy joined congress minister peddireddy reaction, she is also opposition leader kms ys sharmila reddy joined congress minister peddireddy reaction, she is also opposition leader kms](https://static-ai.asianetnews.com/images/01dsthwq90tvf2mzgfvn8e14gg/peddireddy-jpg_363x203xt.jpg)
Peddireddy: వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్లో చేరడం రాజకీయ దుమారాన్ని రేపింది. ఇది కచ్చితంగా వైసీపీ గెలుపు అవకాశాలను కొల్లగొడుతుందని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ నేత, మంత్రి పెద్దిరెడ్డి ఈ పరిణామంపై స్పందించారు.
షర్మిలా రెడ్డి సీఎం జగన్కు చెల్లి అయినంత మాత్రానా ఆమె ఏం చేసినా ఉపేక్షించే పరిస్థితి ఉండదని పెద్దిరెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎవరు ఉన్నా.. జగన్కు ఎవరు వ్యతిరేకంగా పని చేసినా.. వారిని తాము ప్రతిపక్షంగానే చూస్తామని స్పష్టం చేశారు. షర్మిల రెడ్డిని కూడా ప్రతిపక్ష పార్టీ నాయకురాలిగానే చూస్తామని వివరించారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరినంత మాత్రాన రాజకీయంగా తమ కాళ్లు తామే నరుక్కుంటామా? అని అడిగారు.
అంతేకాదు, పూతలపట్టు ఎమ్మెల్యే ఎంఎస్ బాబుపైనా మంత్రి పెద్దిరెడ్డి రియాక్ట్ అయ్యారు. ఎమ్మెల్యే ఎంఎస్ బాబు ఆత్మ విమర్శ చేసుకోవాలని, రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని వివరించారు. జడ్పీటీసీగా ఓడిపోయినా ఆయనను ఎమ్మెల్యేగా చేసిన సంగతిని మరిచిపోకూడదని పేర్కొన్నారు.
Also Read: Telangana: గర్ల్స్ కాలేజీలో వెరైటీ చోరీ.. ‘సలార్ సినిమా చూసి ఎంజాయ్ చేయండి’
కాకినాడలో సీఎం జగన్ పింఛన్ పెంపు కార్యక్రమంలో మాట్లాడుతూ కుటుంబాలను చీల్చుతారని, రాజకీయాలు చేస్తారని ప్రతిపక్షాలపై తీవ్రంగా విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి పెద్దిరెడ్డి ఈ కామెంట్లపైనా రియాక్ట్ అయ్యారు. కుటుంబాలను చీల్చి రాజకీయాలు చేసేది సోనియాగాంధీ, చంద్రబాబు అని ఫైర్ అయ్యారు. వారిద్దరు కలిసే ఆనాడు జగన్ను జైలుకు పంపారని, వారు కుటుంబాలనే కాదు.. మనుషులను చీల్చి రాజకీయాలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదని పేర్కొన్నారు.
తాము పద్ధతిగా రాజకీయాలు చేస్తున్నామని, ఇకపైనా అలాగే ఉంటామని మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. అదే పద్ధతి ప్రకారమే జగన్ వెంటే ఉంటామని వివరించారు. మంచైనా, చెడైనా తాము జగన్ వెంటే ఉంటామని స్పష్టం చేశారు. కలిసి పని చేసి మళ్లీ జగన్ను సీఎం చేస్తామని చెప్పారు.