మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళుర్పించారు.

పులివెందుల: మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి (జూలై 8) సందర్భంగా ఈరోజు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద ఆయన సతీమణి విజయమ్మ, కూతురు వైఎస్ షర్మిలతో పాటు ఇతర కుటుంబ సభ్యులు నివాళుర్పించారు. అనంతరం అక్కడి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ షర్మిల కొడుకు రాజారెడ్డి, కూతురు అంజలి, దివంగత జార్జిరెడ్డి సతీమణి వైఎస్ భారతమ్మ, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి సతీమణి స్వర్ణలత.. తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే.. ఈరోజు తెలంగాణలోని పాలేరులో నిర్వహించే వైఎస్సార్ జయంతి వేడుకల్లో షర్మిల పాల్గొననున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ రోజు మధ్యాహ్నం తర్వాతనే వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. ప్రతి సంవత్సరం జగన్, షర్మిల కలిసే వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొనేవారు. ఈసారి మాత్రం ఒకరికొకరు ఎదురు పడకుండా.. ఎవరికివారే వేర్వేరు సమయాల్లో నివాళులర్పించేలా ప్లాన్ చేసుకున్నట్టుగా తెలుస్తోంది. వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ఈరోజు ఉదయం నివాళులర్పించగా.. సీఎం జగన్ మధ్యాహ్నం అక్కడికి చేరుకోనున్నారు. అయితే సీఎం జగన్ పర్యటనకు సంబంధించి మీడియాకు అనుమతి లేదంటూ ప్రజా సంబంధాల శాఖ పాసుల జారీని నిలిపివేసింది. ఫొటోలు, వీడియోలు, పత్రిక ప్రకటనలు అందిస్తామని తెలిపింది. మరోవైపు ఇడుపులపాయలో షర్మిల పర్యటనకు సంబంధించి మాత్రం మీడియాకు ఆహ్వానం అందింది. ఈ మేరకు వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రత్యేకంగా మీడియాకు ఆహ్వానం పంపింది. 

వైఎస్ జగన్ ఈరోజు ఉదయం అనంతపురం జిల్లా కల్యాణదుర్గంలో పర్యటించనున్నారు. ఆ పర్యటన ముగించుకుని మధ్యాహ్నం ఇడుపులపాయకు చేరుకోనున్నారు. నేటి నుంచి ఈ నెల 10వ తేదీ వరకు సీఎం జగన్ వైఎస్సార్ జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో ఆయన వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు.