గొంతు కోసుకున్న జగన్ అభిమాని
అభిమానం హద్దులు దాటిపోతోంది. తన అభిమాన నేతను కలవనీయటం లేదన్న ఉక్రోషంతో ఓ అభిమాని తన గొంతుకోసుకున్నాడు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర సంచలనం రేపింది.
ఇంతకీ విషయం ఏమిటంటే, వైఎస్ జగన్ గుంటూరు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న విషయం తెలిసిందే. శనివారం గుంటూరు జిల్లా తెనాలిలో జగన్ ప్రజాసంకల్ప యాత్ర నిర్వహించారు.
సహజంగానే యాత్రలో జనం భారీగా పోటెత్తారు. ఆ నేపథ్యంలోనే జగన్ ను కలిసేందుకు కొల్లిపర మండలం మున్నంగి గ్రామానికి చెందిన ఆళ్ల వెంకట్రామిరెడ్డి అనే అభిమాని ప్రయత్నించాడు.
అయితే, జగన్ భద్రత సిబ్బంది అతడిని పట్టించుకోలేదు. అంతేకాకుండా దూరంగా తోసేశారు. తానెంత ప్రయత్నించినా జగన్ను కలవనీయకపోతున్నారనే మనస్తాపంతో అక్కడే అభిమాని బ్లేడుతో గొంతు కోసుకున్నాడు.
వెంటనే విషయాన్ని గ్రహించిన కొందరు అభిమానికి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అదృష్టవశాత్తు ప్రమాదం నుంచి బయటపడగా... ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సకాలంలో వైద్యం అందడంతో అతడి ప్రాణాలకు ముప్పు తప్పింది.