ఇంఛార్జ్ల మార్పుపై కొలిక్కిరాని జగన్ కసరత్తు .. మూడో జాబితా విడుదల వాయిదా, నేతల్లో టెన్షన్
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్ధుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. కొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు లేదా ఎల్లుండి మూడో జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది.
![ys jagan : ycp third list for assembly constituency in charges announcement postponed ksp ys jagan : ycp third list for assembly constituency in charges announcement postponed ksp](https://static-ai.asianetnews.com/images/01gyc6rp76a65yjfdzjv1jv2zw/ys-jagan--2--jpg_363x203xt.jpg)
వచ్చే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి వైసీపీ అభ్యర్ధుల మూడో జాబితా విడుదల వాయిదా పడింది. కొన్ని స్థానాలపై స్పష్టత రాకపోవడంతో పార్టీ అధిష్టానం ఈ నిర్ణయం తీసుకుంది. రేపు లేదా ఎల్లుండి మూడో జాబితాను ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలుగు వార్తాసంస్థ ఎన్టీవీ కథనాన్ని ప్రసారం చేసింది. ఇప్పటి వరకు 38 స్థానాల్లో మార్పులు చేశారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్. మొదటి విడతలో 11 స్థానాల్లో, రెండో జాబితాలో 27 స్థానాల్లో మార్పులు చేర్పులు చేశారు. తొలి జాబితాలో ఎంపీ అభ్యర్ధుల పేర్లు ప్రకటించలేదు. కానీ సెకండ్ లిస్ట్లో మాత్రం ముగ్గురు ఎంపీ స్థానాల్లో మార్పులు చేశారు.
మరోవైపు.. వైసీపీలో అసెంబ్లీ ఇన్ఛార్జ్ల మార్పుల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే వుంది. జగన్ శైలితో వైసీపీ నేతలు , కార్యకర్తల్లో టెన్షన్ పట్టుకుంది. అధినేత ఎవరి టికెట్ చించారో, ఎవరికి కన్ఫర్మ్ చేశారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. సీఎంవో నుంచి ఫోన్ వస్తే చాలు నేతలు వణికిపోతున్నారు. గడిచిన కొద్దిరోజులుగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం వచ్చిపోయే నేతలతో సందడి సందడిగా మారింది. సర్వేలు, ఇతర అంశాలను పరిగణనలోనికి తీసుకుని గెలవరు అని తెలిస్తే చాలు వారిని నిర్దాక్షిణ్యంగా పక్కనపెట్టేస్తున్నారు జగన్.
ఈ లిస్ట్లో సీనియర్ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు వున్నారు. దశాబ్ధాలుగా వైఎస్ కుటుంబంతో అనుబంధం వున్న వారికి కూడా జగన్ నో చెప్పేస్తున్నారు. దీంతో తరతరాలుగా ఒకే నియోజకవర్గాన్ని అంటిపెట్టుకుని రాజకీయం చేస్తున్న కుటుంబాలు మరో చోటికి మారాల్సి వస్తోంది. లేనిపక్షంలో వారు వైసీపీని వీడుతున్నారు. ఇవాళ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ, చిత్తూరు ఎమ్మెల్యే ఆరాని శ్రీనివాసులు, వాసుపల్లి గణేష్, మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే అదీప్ రాజ్లు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో తమ సీటు విషయమై చర్చించారు. మరి వీరికి జగన్ ఎలాంటి హామీ ఇచ్చారో తెలియరాలేదు.