జగన్ @ 100 రోజులు
- వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టి బుధవారానికి 100 రోజులు పూర్తవుతుంది.
వైసిపి శ్రేణులకు నిజంగా పండుగ దినమే. ఎందుకంటే వైసిపి అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్పయాత్ర మొదలుపెట్టి బుధవారానికి 100 రోజులు పూర్తవుతుంది. కడప జిల్లా ఇడుపులపాయలో నవంబర్ 6వ తేదీన మొదలైన పాదయాత్ర రాయలసీమ నాలుగు జిల్లాల్లో పూర్తి చేసుకుని ప్రస్తుతం కోస్తా జిల్లాలో జరుగుతోంది. రాయలసీమలోని చిత్తూరు జిల్లాలో శ్రీకాళహస్తి నుండి కోస్తా జిల్లా అయిన నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేటలోకి అడుగుపెట్టారు.
జగన్ రాయలసీమకు చెందిన వ్యక్తి కాబట్టి జనాలు బాగా వచ్చారని అనుకున్నారు. అయితే, కోస్తా జిల్లాల్లో కూడా అదే ఆధరణ, అంతకన్నా ఎక్కువే కనబడుతోంది మరి. ఇప్పటి వరకూ పాదయాత్రలో 1339 కిలోమీటర్లు నడిచారు. ఐదు జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకుని ఆరో జిల్లా ప్రకాశంలో సాగుతోంది. ఇప్పటి వరకూ 43 నియోజకవర్గాల్లో జగన్ పాదయాత్ర కవర్ చేసారు. 39 బహిరంగ సభల్లో జగన్ ప్రసంగించారు.
వివిధ జిల్లాల్లోని రైతులు, మహిళలు, బిసి సామాజికవర్గాలు, మైనారిటీలు, ఎస్సీ, చేనేత, ఆర్యవైశ్య సామాజికవర్గాలనుద్దేశించి 18 సదస్సుల్లో ప్రసంగించారు. 203 సామాజిక అంశాలపై జగన్ జనాలతో ముఖాముఖి నిర్వహించారు. 190 చోట్ల పార్టీ జెండాలను జగన్ ఆవిష్కరించారు.
జగన్ పాదయాత్ర ఒకరకంగా రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమే సృష్టించింది. ఇంతకు పాదయాత్ర మొదలైన దగ్గర నుండి రాష్ట్ర, కేంద్ర ఇంటెలిజెన్స్ అధికారులు రోజు వారీగా జగన్ పాదయాత్ర విశేషాలపై నివేదికలను సిద్ధం చేసి ప్రభుత్వాలకు అందచేస్తున్నారు. జగన్ ను కలుస్తున్న జనాలను, బహిరంగసభలను పరిశీలించేందుకు పోలీపులు బాడీ కెమెరాలు, ద్రోన్ల వంటి అత్యాధునికి సాంకేతిక పరిజ్ఞానం కూడా ఉపయోగిస్తున్నారు.
పాదయాత్రలో జగన్ కు వస్తున్న జనాధరణపై రాష్ట్రపతి రామ్ నాధ్ కోవింద్, ప్రధానమంత్రి నరేంద్రమోడి కూడా ఆరాతీసినట్లు ప్రచారం జరుగుతోంది. దాంతోనే రాజకీయంగా జగన్ పాదయాత్ర ఎంతటి ప్రభావం చూపుతోందో అర్ధం చేసుకోవచ్చు.
ఒకవైపు ప్రజాసంకల్పయాత్ర జరుగుతుండగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఎప్పటికప్పుడు జనాల్లో పాదయాత్ర ప్రభావంపై జనాల్లో సర్వే చేస్తున్నారట. బుధవారం జగన్ పాదయాత్ర మార్కాపురం, సంతనూతలపాడు నియోజకవర్గాల్లో సాగుతుంది. మొత్తానికి జగన్ పాదయాత్ర రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.