జగన్ అమరావతి ఇంటి ముహూర్తం ఇదే: కేసీఆర్ కూ పిలుపు
ఫిబ్రవరి 14 ఉదయం 8గంటల 21 నిమిషాలకు జగన్ తన నూతన గృహ ప్రవేశం చెయ్యనున్నారు. నూతన గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులు కొంతమంది పార్టీ నేతలను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
అమరావతి: వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నూతన గృహప్రవేశానికి ముహుర్తం ఖరారైంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో బైపాస్ రోడ్డు సమీపంలో జగన్ తన స్వగృహంతోపాటు పార్టీ కార్యాలయాన్ని కూడా నిర్మించారు. ఒకవైపు ఇల్లు మరోవైపు పార్టీ కార్యాలయాన్ని నిర్మించారు.
అయితే ఫిబ్రవరి 14 ఉదయం 8గంటల 21 నిమిషాలకు జగన్ తన నూతన గృహ ప్రవేశం చెయ్యనున్నారు. నూతన గృహ ప్రవేశానికి కుటుంబ సభ్యులు కొంతమంది పార్టీ నేతలను మాత్రమే ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు ఇంటికి సమీపంలోనే అంటే పక్కన పార్టీ కార్యాలయాన్ని కూడా వైఎస్ జగన్ నిర్మించారు. ఈ నేపథ్యంలో గృహ ప్రవేశాన్ని కుటుంబ సభ్యులు, ఆప్తులను ఆహ్వానించి పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం మాత్రం భారీగా చెయ్యాలని ఆ పార్టీ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖులను జగన్ ఆహ్వానించే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ ను వైసీపీ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి పిలిచే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతుంది.
గతంలోనే వైఎస్ జగన్ ను కలుస్తానని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రకటించారు. అటు చంద్రబాబాబు నాయుడుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానంటూ కూడా వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ జగన్ గృహ ప్రవేశానికి హాజరైతే రాజకీయంగా మరింత వేడి రాజుకునే అవకాశం ఉంది.
వైఎస్ జగన్ నూతన గృహ ప్రవేశం అనంతరం పార్టీ కార్యాక్రమాలు అన్నీ అమరావతి నుంచే నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. జగన్ ప్రజా సంకల్పయాత్ర తర్వాత తీసుకున్న మెుదటి నిర్ణయం కూడా ఇదే. ఇకపోతే అమరావతి కేంద్రంగా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్, జనసేన పార్టీలు పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ప్రధాన ప్రతిపక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ కార్యక్రమాలు అమరావతి నుంచే నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో ఎన్నికల సమరానికి పార్టీల వ్యూహాలతో రాజధాని అమరావతి మరింత వేడెక్కనుంది.