నేను వచ్చా, చంద్రబాబూ పిట్టల దొరలా వచ్చాడు: జగన్
పోలవరం పనులు నత్తనడకగా సాగుతున్నాయని, డెల్టా కాలువ పనులు ఆగిపోయాయని, ఏ పని కూడా ఒక్క అడగు కూడ ముందుకు వెళ్లని పరిస్థితుల్లో తూర్పు గోదావరి జిల్లా ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు
ముమ్మిడివరం: పోలవరం పనులు నత్తనడకగా సాగుతున్నాయని, డెల్టా కాలువ పనులు ఆగిపోయాయని, ఏ పని కూడా ఒక్క అడగు కూడ ముందుకు వెళ్లని పరిస్థితుల్లో తూర్పు గోదావరి జిల్లా ఉందని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ అన్నారు
రైతులంతా గతంలో క్రాప్ హాలిడే డిక్లేర్ చేశారని, నవంబర్ వచ్చే సరికి ఈ ప్రాంతంలో వరుసగా తుఫానులు వస్తాయని, తుఫానులతో చేతికొచ్చిన పంట నీటిమయమమ్యే అవకాశం ఉందని, జూన్ తొలి మాసంలోనే నీళ్లందించాలని, క్రాప్ హాలిడేను డిక్లేర్ చేశారని అన్నారు.
"ఆ రోజు నేను వచ్చా.. చంద్రబాబు సైతం పిట్టల దొరలా వచ్చాడు. జూన్ తొలి వారంలోనే నీళ్లు అందిస్తానని హామీ ఇచ్చాడు. ఈ నాలుగేళ్లలో ఒక్కసారైనా నీళ్లు అందయా" అని ఆయన అడిగారు. జూన్ మాసం దేవుడేరుగు.. మళ్లీ నవంబర్ వస్తుంది... నారుమళ్లు వేస్తున్న రైతన్నా మళ్లీ భయపడుతున్నాడని అన్నారు.
ఈ ప్రాంతంలో పెట్రోలియం వనరులు పుష్కలంగా ఉన్నా ఇక్కడి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు లభించడం లేదని ఆయన అన్నారు. చమురు, గ్యాస్ తీసుకుంటున్నారు.. కానీ ఇక్కడి ప్రజలను మాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ప్రజాసంకల్పయాత్ర 201వ రోజు పాదయాత్రలో భాగంగా ముమ్మిడివరం హైస్కూల్ సెంటర్ వద్దనిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
జీవనది గోదావరి ప్రవహించే నేల కోనసీమ.. అయినా తాగునీరు ఉండదని,, కోనసీమ ముఖ చిత్రం ఇలా ఉంటే .. బాబుగారి దోపిడీ మాత్రం గేదల లంకే వరకు విస్తరించిందని ఆయన అన్నారు. అదే గ్రామంలో ఈ దోపిడి అడ్డుకున్న మహిళలు, యువకులపై అనేక కేసులు పెట్టారని ఆయన అన్నారు.
ఎన్నికలకు ముందు హోదా సంజీవిని అన్న చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్యాకేజీ అడిగారని, అప్పుడు విభజన చట్టంలోని హామీలు ఏమిగుర్తుకు రాలేదని, కానీ ఈ మధ్యలో ధర్మపోరాటం అని, కాకినాడలో ఆశ్చర్యం కలిగించే మాటలు చెప్పాడని జగన్ అన్నారు.
బీజేపీతో కలిసున్నన్ని రోజులు మాట్లాడని చంద్రబాబు కొత్తగా 25 మంది ఎంపీలను ఇస్తే ప్రత్యేక హోదా తీసుకొస్తానని అంటున్నారని ఆయన అన్నారు. 25 మందిలో 20 మంది ఎంపీలు చంద్రబాబు వద్దే ఉన్నారని అంటూ ఇంత మంది ఎంపీలతో నాలుగేళ్లుగా ఆయన గాడిదలు కాస్తున్నారా.? ఆయన అడిగారు.