విద్యా వ్యవస్థపై అధికారులతో క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విద్యావిధానం తదితర అంశాలపై అధికారులకు సీఎం  కీలక ఆదేశాలిచ్చారు.  

అమరావతి: నూతన విద్యావిధానం కింద ఇదివరకే తీసుకున్న నిర్ణయాలపై సీఎం వైఎస్ జగన్ ఇవాళ(బుధవారం) సమీక్ష చేపట్టారు. విద్యాశాఖ ఉన్నతాధికారులతో తన క్యాంప్‌ కార్యాలయంలో సీఎం సమావేశం నిర్వహించారు. మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇంగ్లిషు బోధన, డిజిటల్‌ లెర్నింగ్, మండలానికి రెండు జూనియర్‌ కళాశాలల ఏర్పాటు తదితర అంశాలపై సీఎం అధికారులతో చర్చించారు. 

విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు. వాటి అమలు తీరును సీఎం జగన్ కు అధికారులు వివరించారు. నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్‌ చేశామని అధికారులు తెలిపారు. ఫిబ్రవరి 14నుంచి ప్రతిరోజూ ఒక ఇంగ్లిషు పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన సాగుతుందన్నారు. వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్‌ లెర్నింగ్‌ జరిగేలా ఏర్నాట్లు చేస్తున్నట్లు అధికారులు సీఎంకు వివరించారు. 

 ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచేలా తగిన చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాల, ఒక మహిళా జూనియర్‌ కళాశాల ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. జూనియర్‌ కళాశాలలు లేని మండలాల గుర్తించినట్లు తెలిపారు. స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్‌ ఫ్రీ నంబర్‌ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎస్‌సీఈఆర్‌టీ సిఫార్సుల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు సీఎంకు అధికారులు వివరించారు.

''ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారు. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. అందుకనే విద్యావ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించాం. సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదు. దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలి. 
దీంట్లో భాగంగానే బోధనేతర కార్యక్రమాల్లో వారిని వినియోగించకుండా చూడాలి'' అని అధికారులకు సీఎం ఆదేశించారు.

'' విద్యార్థులకు ప్రతిరోజూ ఒక పదాన్ని నేర్పేటప్పుడు డిక్షనరీలో దాన్ని చూసి అర్థం తెలుసుకోవడంతో పాటు, వాక్యంలో ఎలా ఉపయోగించాలో కూడా నేర్పాలి. మొదటిరోజు పదం చెప్పడం, అసైన్‌మెంట్‌ ఇచ్చి రెండో రోజు దాన్ని ఉపయోగించడం నేర్పించాలి'' అని సీఎం సూచించారు. 

''స్కూళ్లలో హెడ్‌ మాస్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. విద్యార్థులకు కెరీర్‌గైడెన్స్‌ ఇవ్వాలి. తల్లిదండ్రులతో మంచి సంబంధాలు నెరుపుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేలా హెడ్‌మాస్టర్లు ఉండాలి. ప్రతి విద్యార్థినీ, వారి తల్లిదండ్రులనూ విడివిడిగా కలుస్తూ వారి భవిష్యత్తుకు మంచి మార్గం వేసేలా కౌన్సిలింగ్‌ ఇవ్వాలి'' అనిసీఎం సూచించారు.

''స్కూళ్లలో నాడు-నేడు కింద ఏర్పాటుచేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి... లేకపోతే ఇంత చేసీ ఫలితం వుండదు. టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్ల నిర్వహణ బాగుండాలి. ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే దాన్ని పరిష్కరించి, సమర్థవంతంగా నిర్వహించాలి. ఫిర్యాదు వచ్చిన వారంరోజుల్లోగా పరిష్కారం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని టెక్నికల్, ఇంజనీరింగ్‌ సిబ్బంది, విలేజ్‌ క్లినిక్స్‌లో సిబ్బందికి స్కూళ్లలో వసతుల నిర్వహణపై తగిన ఎస్‌ఓపీలను ఇవ్వాలి'' అని అధికారులను ఆదేశించారు.. 

''రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్‌ కాలేజీతోపాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్‌ సమ్మిళతంగా ఒక స్కిల్‌ సెంటర్‌ ఉండాలన్నారు. వీటన్నింటికీ పాఠ్యప్రణాళికను స్కిల్‌ యూనివర్శిటీ రూపొందించాలని, దీన్ని తిరుపతిలో పెడతామని ఇదివరకే నిర్ణయం తీసుకున్నామని, ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టాలని సీఎం ఆదేశించారు. నైపుణ్యం ఉన్న మానవవనరులకు చిరునామాగా రాష్ట్రం ఉండాలన్న సీఎం జగన్ ఆదేశించారు.