రేపు ఒడిశాకు వెళ్లనున్న సీఎం YS Jagan.. క్యాంపు కార్యాలయంలో సమీక్ష.. ముఖ్యంగా వీటి మీదే ఫోకస్..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Redddy) రేపు(నవంబర్ 9) ఒడిశా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో (Naveen Patnaik) చర్చించాల్సిన అంశాలపై ఏపీ సీఎం జగన్.. నేడు క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Redddy) రేపు(నవంబర్ 9) ఒడిశా వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్తో (Naveen Patnaik) చర్చించాల్సిన అంశాలపై ఏపీ సీఎం జగన్.. నేడు క్యాంప్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు. మంగళవారం సాయంత్రం సీఎం నవీన్ పట్నాయక్తో భేటీ కానున్న జగన్.. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై చర్చలు జరపనున్నారు. ముఖ్యంగా మూడు అంశాలపై ఆయనతో చర్చించనున్నారు. వంశధారపై నేరడి వద్ద బ్యారేజీ నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, కొఠియా గ్రామాల అంశాలపై చర్చించనున్నట్టగా సీఎం కార్యాలయం తెలిపింది.
Also read: YS Jagan: నవంబర్ 9న శ్రీకాకుళం జిల్లాకు సీఎం వైఎస్ జగన్.. షెడ్యూల్ ఇదే..
నేరడి బ్యారేజీ కారణంగా ఉభయ రాష్ట్రాలకూ కలగనున్న ప్రయోజనాలను నవీన్ పట్నాయక్కు జగన్ వివరించనున్నారు. జంఝావతి ప్రాజెక్టుకు సంబంధించి ఒడిశాలో ముంపుకు గురవుతున్న భూమికి సంబంధించిన ఆర్అండ్ ఆర్కు సహకరించాలని కోరనన్నారు. ఈ సమావేశంలో సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, డీజీపీ గౌతం సవాంగ్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార విశ్వజిత్, జలవనరులశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, జలవనరులశాఖ ఈఎన్సి సి నారాయణరెడ్డి, విజయనగరం జిల్లా కలెక్టర్ ఎ సూర్య కుమారి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also read: ఢిల్లీలో ధర్నా చేయండి, మద్దతిస్తా: పెట్రోల్ ధరల తగ్గింపుకై బీజేపీ నేతలకు పేర్ని సలహా
వంశధారపై నేరడి బ్యారేజీ నిర్మాణం
-బ్యారేజీ నిర్మాణానికి ఒడిశా వైపునుంచి 103 ఎకరాలు అవసరమని ఇందులో 67 ఎకరాలు రివర్బెడ్ ప్రాంతమేనని అధికారులు తెలిపారు.
*బ్యారేజీ నిర్మాణం వల్ల ఒడిశావైపు కూడా సుమారు 5–6 వేల ఎకరాలకు తక్షణమే సాగునీరు అందుతుందని అధికారులు తెలిపారు.
జంఝావతి ప్రాజెక్టు అంశం
-ప్రస్తుతం రబ్బర్ డ్యాం ఆధారంగా సాగునీరు ఇస్తున్నామని అధికారులు తెలిపారు.
-24,640 ఎకరాల్లో కేవలం 5 వేల ఎకరాలకు మాత్రమే నీరు ఇవ్వగలుగుతున్నామని, ప్రాజెక్టు పూర్తిచేస్తే రైతులకు పూర్తిస్థాయిలో మేలు జరుగుతుందని పేర్కొన్నారు
-ప్రాజెక్టును పూర్తిచేస్తే ఒడిశాలో 4 గ్రామాలు పూర్తిగా, పాక్షికంగా 6 గ్రామాలు ముంపునకు గురవుతాయని అధికారులు పేర్కొన్నారు.
-ఒడిశాలో దాదాపు 1174 ఎకరాల భూమి ముంపునకు గురవుతుందని తెలిపిన అధికారులు.ఇందులో 875 ఎకరాలు ప్రభుత్వ భూమేనని పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్అండ్ఆర్కు సహకరించాలని ఏపీ ఒడిశాను కోరనుంది.
కొఠియా గ్రామాల వివాదం
-కొఠియా గ్రామాల వివాదానికి సంబంధించిన మొత్తం వివరాలను అధికారులు సీఎం ముందు ఉంచారు. ఇటీవల అక్కడ చోటుచేసుకున్న పరిణామాలను సీఎంకు చెప్పారు.
-21 గ్రామాల్లో 16 గ్రామాలు ఏపీతోనే ఉంటామంటూ తీర్మానాలు చేసి ఇచ్చారని విజయనగరం జిల్లా కలెక్టర్ సూర్యకుమారి సీఎంకు వివరించారు.
-ఇటీవల ఆయా గ్రామాల్లో ఎన్నికలు కూడా నిర్వహించామని సమావేశంలో అధికారులు పేర్కొన్నారు.
-కొఠియా గ్రామాల్లో దాదాపు 87శాతానికి పైగా గిరిజనులు ఉన్నారని, వారికి సేవలు అందించే విషయంలో అవాంతరాలు లేకుండా చూడాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని సమావేశంలో అధికారులు ప్రస్తావించారు.
సీఎం జగన్ టూర్ షెడ్యూల్..
సీఎం జగన్ మంగళవారం తొలుత శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి వివాహానికి హాజరవుతారు. అనంతరం ఒడిశా బయలుదేరి వెళతారు. ఇందుకోసం.. సీఎం జగన్ 11 గంటలకు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి మధ్యాహ్నం 01.15 గంటలకు పాతపట్నం చేరుకుంటారు. అక్కడ రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్కు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. శ్రీకాకుళం పర్యటన అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని మధ్యాహ్నం 3.30 గంటలకు ఒడిశా రాజధాని భువనేశ్వర్ బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నివాసానికి సీఎం వైయస్ జగన్ చేరుకుంటారు. చర్చల అనంతరం రాత్రి 7 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి.. రాత్రి 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు.