YSRCP Digital Book : వైఎస్ఆర్సీపీ కార్యకర్తల కోసం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ ప్రారంభించారు. అన్యాయానికి గురైన కార్యకర్తలకు అండగా ఉంటామనీ, అధికారంలోకి వచ్చాక దర్యాప్తు చేస్తామని అన్నారు.
YS Jagan launches YSRCP Digital Book: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, పార్టీ కార్యకర్తలకు అండగా నిలవడానికి ప్రత్యేకంగా డిజిటల్ బుక్ ను ప్రారంభించారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో అన్యాయానికి గురైన కార్యకర్తలు, నాయకులు తమ సమస్యలను డిజిటల్ బుక్ లో సులభంగా నమోదు చేసుకోవచ్చని తెలిపారు.
అలాగే, “ఇప్పటికే రెడ్ బుక్ పేరుతో పార్టీ కార్యకర్తలను వేధిస్తున్నారు. ఇప్పుడు డిజిటల్ బుక్ ద్వారా మన కార్యకర్తలు ఎదుర్కొన్న అన్యాయాలను శాశ్వత డిజిటల్ రికార్డుగా భద్రపరుస్తాం. సప్త సముద్రాల వెనుక ఉన్నవారిని కూడా చట్టం ముందు నిలబెట్టే ప్రయత్నం చేస్తాము” అని జగన్ అన్నారు.
ఏంటి ఈ డిజిటల్ బుక్?
ఈ డిజిటల్ బుక్ కోసం ప్రత్యేకంగా Digitalbook.weysrcp.com అనే పోర్టల్ ప్రారంభించారు. ఇందులో కార్యకర్తలు, నాయకులు తాము ఎదుర్కొన్న అన్యాయాలను, రాజకీయ హింసలను, ఫిర్యాదులను ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్లతో సహా నేరుగా అప్లోడ్ చేయవచ్చు. ప్రతి ఘటనను పర్మనెంట్ డిజిటల్ డైరీలో నమోదు చేసి భవిష్యత్తులో SIT దర్యాప్తులకు ఆధారంగా ఉపయోగించనున్నట్టు జగన్ తెలిపారు.
ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫిర్యాదు చేయడం కోసం 040-49171718 టోల్ ఫ్రీ IVRS సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు. ఫోన్ ద్వారా ఫిర్యాదు నమోదు చేస్తే ఆటోమేటెడ్ రిఫరెన్స్ నంబర్ అందుతుంది. అలాగే, క్యూఆర్ కోడ్ సౌకర్యం ద్వారా కూడా ఇన్పుట్ సులభతరం అయ్యేలా చేశారు. “ఈ రెండు సౌకర్యాలు కలిపి పార్టీ కార్యకర్తలకు 24/7 సపోర్ట్ అందిస్తాయి” అని తెలిపారు.
ప్రభుత్వ వేధింపులకు వైపాకా పోరాటం
జగన్ ప్రత్యేకంగా కూటమి పాలనలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఎదుర్కొంటున్న వేధింపులపై ఘాటైన హెచ్చరికలు ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చాక బాధ్యులను వదిలిపెట్టే ప్రసక్తి లేదనీ, సప్త సముద్రాల వెనక ఉన్నవారిని కూడా చట్టం ముందు నిలబెడతామని చెప్పారు.
“ప్రతి అన్యాయాన్ని డిజిటల్ బుక్లో నమోదు చేయాలి. ఇది నాయకత్వానికి సమాచారం అందించడమే కాక, భవిష్యత్తులో న్యాయపరమైన చర్యలకు ఆధారంగా ఉపయోగపడుతుంది” అని జగన్ అన్నారు. పార్టీ నేతలకు, శ్రేణులకు కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజాస్ఫూర్తితో పోరాటానికి సిద్ధమవ్వమని పిలుపునిచ్చారు.
వైఎస్ఆర్సీపీ డిజిటల్ బుక్, పార్టీ కార్యకర్తలకు మాత్రమే పరిమితం కాకుండా, రాజకీయ బాధితులకూ సహాయం అందించేలా రూపొందించినట్టు తెలిపారు. దీని ద్వారా పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ సమస్యలను సురక్షితంగా నమోదు చేసి న్యాయం కోసం ముందుకు రావచ్చని చెప్పారు.
