పీసీఏ చైర్మన్ గా జస్టిస్ కనగరాజ్: నిబంధనలను బేఖాతరు చేసిన జగన్ సర్కార్
జస్టిస్ కనగరాజ్ ను పీసీఏ చైర్మన్ గా నియమిస్తూ ఏపీ సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ కనగరాజ్ నియామకంలో ప్రభుత్వం నిబంధనలను ఉల్లంఘించినట్లు విమర్శలు వస్తున్నాయి.
అమరావతి: జస్టిస్ కనగరాజ్ ను ఆంధ్రప్రదేస్ పోలీసు కంప్లయింట్ అథారిటీ (పీసీఎ) చైర్మన్ గా నియమిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. మూడేళ్ల పాటు జస్టిస్ కనగరాజ్ పీసీఎ చైర్మన్ గా కొనసాగుతారని ప్రభుత్వం తెలిపింది.
అథారిటీలో ఓ రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, ఓ ఐపిఎస్ అధికారి, స్వచ్ఛంద సేవా సంస్థకు చెందిన ఓ ప్రతినిధి సభ్యులుగా ఉంటారు వారిని ప్రభుత్వం త్వరలోనే ఎంపిక చేస్తుంది. జిల్లా స్థాయిలో కూడా పిసీఏలు ఏర్పాటవుతాయి. సుప్రీంకోర్టు తీర్పు మేరకు ప్రభుత్వం పిసీఏను ఏర్పాటు చేసింది. పోలీసులు ఎవరైనా ప్రజల ఫిర్యాదులు తీసుకోకపోయినా, దర్యాప్తులో న్యాయం చేయకపోయినా అథారిటీని ఆశ్రయించవచ్చు.
నిరుడు ఏప్రిల్ లో ఎన్నికల కమిషనర్ గా రమేష్ కుమార్ ను తప్పించడం కోసం ఓ ఆర్డినెన్స్ తెచ్చి రాత్రికి రాత్రి చెన్నైనుంచి జస్టిస్ కనగరాజ్ ను ప్రభుత్వం విజయవాడకు రప్పించింది. ఆయన చేత ఎన్నికల కమిషనర్ గా ప్రమాణ స్వీకారం చేయించింది. అయితే ప్రభుత్వ ఆర్డినెన్స్ ను హైకోర్టు కొట్టేసింది. దాంతో పాటు ఏపీఎస్ఈసీగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకాన్ని పునరుద్ధరించింది. దాంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తిరిగి బాధ్యతలు స్వీకరించారు
తన నియామకం రద్దు కావడంతో మూడు నెలల లోపే కనగజార్ తిరిగి వెళ్లిపోయారు. దాదాపు ఏడాది తర్వాత తిరిగి కనగరాజ్ కు పిసీఏ చైర్మన్ పదవిని ప్రభుత్వం ఇచ్చింది.
అయితే, నిబంధనలకు విరుద్ధంగా కనగరాజ్ నియామకం జరిగిందనే విమర్శలు వస్తున్నాయి. ఆంధ్రప్రదేస్ పోలీసు కంప్లయింట్ అథారిటీ రూల్స్ - 2002లోని సెక్షన్ 4(ఏ) ప్రకారం రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తిని పిసీఎ చైర్మన్ గా నియమించాలి. 65 ఏళ్లు వచ్చేవరకు లేదా మూడేళ్లు అది ముందయితే అప్పటి వరకు ఆ పదవిలో కొనసాగడానికి అర్హులు. 65 ఏళ్ల వయస్సు దాటినవారు ఆ పదవిలో కొనసాగడానికి వీలు లేదు. జస్టిస్ కనగరాజ్ కు 75 ఏళ్ల వయస్సు ఉంటుందని చెబుతున్నారు అందువల్ల పిసీఏ చైర్మన్ గా ఆయన నిమాకం చెల్లదని అంటున్నారు