ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాశ్ అధికారాలకు జగన్ ప్రభుత్వం కత్తెర
టాప్ ఆఫీసర్ ప్రవీణ్ ప్రకాశ్ దూకుడుకు కళ్లెం పడింది. ప్రవీణ్ ప్రకాశ్ అధికారాలకు కత్తెర వేస్తూ ఆయనను జీఎడీ పొలిటికల్ కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పిస్తూ సీఎ స్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
అమరావతి: వివాదాస్పద ఉన్నతాధికారి ప్రవీణ్ ప్రకాశ్ అధికారాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వం కత్తెర వేసిది. ఆయన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా ఉన్నారు. ప్రవీణ్ ప్రకాశ్ తీరు పట్ల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నట్లు తెలుసతోంది. దీంతో ప్రవీణ్ ప్రకాశ్ అధికారాలను తగ్గిస్తూ ఆదిత్యనాథ్ దాస్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ప్రవీణ్ ప్రకాశ్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి పదవితో పాటు అదనంగా సాధారణ పరిపాలనా శాఖ (పొలిటికల్) బాధ్యతలను కూడా నిర్వహిస్తూ వస్తున్నారు. జిఎడీ పొలిటికల్ కార్యదర్శి పదవి నుంచి ప్రవీణ్ ప్రకాశ్ ను తప్పించి ఆ స్థానంలో ముత్యాలరాజును నియమిస్తూ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. దాంతో ప్రవీణ్ ప్రకాశ్ ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శిగా మాత్రమే కొనసాగనున్నారు.
ఎల్వీ సుబ్రహ్మణ్యం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్నప్పుడు ప్రవీణ్ ప్రకాశ్ తన పరిధిని మించి వ్యవహరించారనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇవ్వాల్సిన జీవోలను ముఖ్యమంత్రి అనుమతితో జీఎడీ పొలిటికల్ సెక్రటరీ ఇవ్వవచ్చునంటూ ప్రవీణ్ ప్రకాశ్ తానే ఓ జారీ చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వీ సుబ్రహ్మణ్యంను తొలగించడంలో ప్రవీణ్ ప్రకాశ్ కీలక పాత్ర నిర్వహించారని కూడా అంటారు.
జిఎడీ పొలిటికల్ సెక్రటరీ హోదాలో ప్రవీణ్ ప్రకాశ్ తీసుకున్న నిర్ణయాలను కొన్నింటిని ఆదిత్యనాథ్ తప్పు పట్టినట్లు తెలుస్తోంది. కోర్టుల్లో ప్రతిసారీ ప్రభుత్వంపై మొట్టికాయలు పడుతున్న తీరుపై కొద్ది రోజుల క్రితం ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. ప్రవీణ్ ప్రకాశ్ నిర్ణయాలపై ఈ సమావేశంలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఆ స్థితిలో ప్రవీణ్ ప్రకాశ్ అధికారాలకు కళ్లెం వేయడం అవసరమని సీఎస్ ఆదిత్యనాథ్ పట్టుబట్టినట్లు సమాచారం. దాంతో జగన్ అందుకు అంగీకరించినట్లు తెలుస్తోంది. ముత్యాల రాజు జిఎడీ పొలిటికల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు తీసుకుంటారు.