రాజధానికి ఒక్క ఇటుక కూడా పడలేదు: చంద్రబాబుపై జగన్ ధ్వజం
రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉన్నారని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్ కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు.
విశాఖపట్నం: రాష్ట్రంలో ఎంతోమంది మేధావులు, ఇంజనీర్లు ఉన్నారని, అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజధాని పనులు సింగపూర్ కంపెనీలకు అప్పగిస్తున్నారని ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. 262వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శనివారం ఆయన విశాఖపట్నంలోని బీఆర్టీఎస్ రోడ్డులో ఏర్పాటు చేసిన ఇంజనీర్ డే వేడుకల్లో పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఉన్న ఇంజనీర్లను కాదని చంద్రబాబు నాయుడు సింగపూర్ కంపెనీలకు పనులు అప్పగించడాన్ని ఆయన తప్పు పట్టారు. రాష్ట్రంలో ఉన్న టాలెంట్ ఇంజనీర్లను కాదని చంద్రబాబు విదేశీ వ్యక్తులకు రాష్ట్ర ప్రాజెక్టు పనులు అప్పగిస్తున్నారని అన్నారు.
నాలుగున్నరేళ్లలో చంద్రబాబు రాష్ట్రానికి చేసిన అభివృద్ధి గుండుసున్నా అని అన్నారు. రాజధాని నిర్మాణానికి ఇప్పటివరకూ ఒక్క ఇటుక కూడా పడలేదని అన్నారు. తన ప్రజాసంకల్పయాత్రకు సంఘీభావం తెలపడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు