రైతులకు గిట్టుబాటు ధరలేదు.. హెరిటేజ్లో దోచుకుంటున్నారు: వైఎస్ జగన్
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అనకాపల్లిలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా అనకాపల్లిలో జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. నందమూరి హరికృష్ణ మరణంపై ప్రగాఢ సానుభూతిని తెలిపిన జగన్.. తాను అధికారంలోకి రాగానే అనకాపల్లిని జిల్లా చేస్తానన్నారు..
అనకాపల్లి పేరు చెప్పగానే ముందుగా గుర్తొచ్చేది బెల్లమని.. కానీ ఇది తయారు చేసే వారి జీవితాలు చేదుగా మారాయని అన్నారు. చంద్రబాబు హెరిటేజ్లో కిలో బెల్లం ధర రూ. 84.. కానీ రైతులు తయారుచేసిన క్వింటాల్ బెల్లానికి రూ. 2500 నుంచి రూ.3 వేలు పలకడం లేదు.
అలాగే చంద్రబాబు సీఎం అయ్యాక సహకార రంగంలోని డెయిరీలు మూతబడ్డాయి.. ప్రైవేట్ రంగంలో ఉన్న డైరీలన్నీ ఒక్కటవుతున్నాయి... రైతుల దగ్గర లీటర్ పాలు 26 రూపాయలకు కొనుక్కుంటారు.. కానీ పాలలోంచి వెన్న తీసేసి ఇదే హెరిటేజ్ షాపుల్లో అర లీటర్ పాల ప్యాకెట్ను 26 రూపాయలకు అమ్ముతున్నారు.
స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబే దళారిగా మారితే రైతులను ఆదుకునేది ఎవరని జగన్ ప్రశ్నించారు. మరో ఆరు నెలల్లో ఎన్నికలు రాబోతున్నాయని.. మళ్లీ చంద్రబాబు మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారని.. అయితే మనస్సాక్షికి నచ్చినట్లు ఓటేయాలని జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు.