వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎడవల్లి సుబ్బారావు మృతిపై సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. పార్టీ తరఫున సుబ్బారావు కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు.

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఎడవల్లి సుబ్బారావు మృతిపై సీఎం వైఎస్ జగన్ విచారం వ్యక్తం చేశారు. విజయవాడలో ఈ నెల 7వ తేదీ వైసీపీ జయహో బీసీ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సభకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం వెస్ట్ విప్పర్రు గ్రామానికి చెందిన వైసీపీ నేత ఎడవల్లి సుబ్బారావు కూడా హాజరయ్యారు. అయితే అక్కడ చోటుచేసుకనున్న తొక్కిసలాట నేపథ్యంలో.. ఎడవల్లి సుబ్బారావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను చికిత్స నిమిత్తం విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఎడవల్లి సుబ్బారావు మంగళవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఈ విషయం తెలిసిన వెంటనే మంత్రి కొట్టు సత్యనారాయణ ఆస్పత్రికి వెళ్లి సుబ్బారావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ విషయాన్ని వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. సుబ్బారావు మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం జగన్.. పార్టీ తరఫున రూ. 10 లక్షల సాయం ప్రకటించారు. ఈ మేరకు మంత్రులు కొట్టు సత్యనారాయణ, జోగి రమేష్ వివరాలు వెల్లడించారు. ఇది బీసీల తరఫున సీఎం జగన్‌కు ఉన్న చిత్తశుద్దికి నిదర్శనమని చెప్పారు. ఆ మొత్తాన్ని మృతుడి గ్రామానికి వెళ్లి స్వయంగా అందజేయనున్నట్లుగా చెప్పారు. 

ఇక, అంతకుముందు తొక్కిసలాటలో గాయపడి విజయవాడలోని జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న ముగ్గురు బాధితులను, ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సుబ్బారావును కలిసి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మంత్రులు గుర్తుచేశారు. ఎడవల్లి సుబ్బారావుకు మెరుగైన వైద్య చికిత్స అందించినప్పటికీ మరణించారని, ఆయన మృతి బాధాకరమని కొట్టు సత్యనారాయణ అన్నారు.