ఆంధ్ర శశికళ అవుతానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భయపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

విజయవాడ: ఆంధ్ర శశికళ అవుతానని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ భయపడుతున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. వైసిపి అనుభవం లేని పార్టీ అని, ఆ పార్టీ నాయకుడికి అనుభవం లేదని ఆయన అన్నారు. దొంగ లెక్కలు రాసుకోవడం తప్ప అభివృద్ధి అంటే తెలియని వ్యక్తి అని ఆయన జగన్ పై తీవ్రంగా ధ్వజమెత్తారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అలాంటి వ్యక్తి అదిస్తాను, ఇదిస్తాను, కనపడేదంతా ఇస్తా అంటాడని అని అంటూ ఎలా ఇస్తాడని చంద్రబాబు ప్రశ్నించారు. వైఎస్‌ హయాంలో 24వేల మంది రైతులు ఆత్మహత్మలు చేసుకున్నారని ఆయన చెప్పారు కరెంటు షాక్‌లు, రాత్రిపూట పాముకాటుతో మరింతమంది రైతులు చనిపోయారని, నాటి అవినీతికి ఆనవాళ్లుగా వాన్‌పిక్‌, లేపాక్షి సెజ్‌లు ఇప్పటికీ ఉన్నాయని చంద్రబాబు అన్నారు. 

బిజెపి కేంద్రంలో నాలుగేళ్లు, తాము రాష్ట్రంలో నాలుగేళ్లు పాలించామని, బిజెపి సహకరించకున్నా అభివృద్ధి చేసుకుంటూ వారిపై పోరాడుతున్నామని అన్నారు. కానీ మీరేం చేశారని ఆయన బిజెపిని ప్రశ్నించారు. తాను 29సార్లు ఢిల్లీ వచ్చి కోరినా న్యాయం చేయలేదని, దేశ రాజకీయాలను మార్చే శక్తి తెలుగుదేశానికి ఉందని అన్నారు.

ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అని, దీనికి తెలంగాణ కూడా మద్దతిచ్చే పరిస్థితికి వచ్చింది. అప్పటి ప్రధాని మాటలకు, ఇప్పటి ప్రధాని మాటలకు విలువ లేకపోతే ఎలా అని ఆయన ప్రశ్నించారు. మనపై కర్రపెత్తనం చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోందని అన్నారు. అలాగే బెదిరిస్తే ప్రజలు భయపడతారనుకుంటోందని, కానీ వారి ఆటలు ఇక్కడ సాగవని అన్నారు. 

మన రాజధాని అమరావతికి నిధులు ఇవ్వనప్పుడు మనమెందుకు కేంద్రానికి పన్నులు కట్టాలని ఆయన అడిగారు. అమరావతి నిర్మాణం పూర్తయ్యాక దానివల్ల కేంద్రానికే ఎక్కువ పన్నులు వెళ్తాయిని,అలాంటి రాజధాని నిధులు ఇవ్వడం లేదని అన్నారు.