వైఎస్ వివేకా కేసు.. జైల్లో అస్వస్థతకు గురైన అవినాష్ రెడ్డి తండ్రి , ఉస్మానియాలో చికిత్స
వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు
ఏపీ సీఎం వైఎస్ జగన్ బాబాయ్, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుతం చంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా వున్న ఆయనకు శుక్రవారం ఒక్కసారిగా బీపీ పెరిగింది. దీంతో భాస్కర్ రెడ్డిని జైలు సిబ్బంది ఉస్మానియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అనంతరం తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు.
మరోవైపు కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాస్కర్ రెడ్డి సతీమణి శ్రీలక్ష్మీ శుక్రవారం డిశ్చార్జ్ అయ్యారు. మెరుగైన వైద్యం కోసం ఆమెను హైదరాబాద్కు తరలించారు. ఈ నెల 19 నుంచి శ్రీలక్ష్మీ కర్నూలు విశ్వభారతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పులివెందులలోని తన నివాసంలో వైఎస్ శ్రీలక్ష్మి ఈ నెల 19న అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమెను తొలుత స్థానిక దినేష్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను కర్నూల్ లోని విశ్వభారతి ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం శ్రీలక్ష్మీ ఆరోగ్యం మెరుగుపడింది. ఈ విషయాన్ని విశ్వభారతి ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులెటిన్ లో ప్రకటించారు.
Also Read: అరెస్ట్ చేసేందుకు సీబీఐ ఉత్సాహం వైఎస్ :అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై కీలక వాదనలు
కాగా.. వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ 1 నిందితుడుగా వున్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై సుప్రీంకోర్టు శుక్రవారంనాడు స్టే ఇచ్చింది. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ను ఈ ఏడాది ఏప్రిల్ 27న తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఈ ఏడాది మే 5వ తేదీ లోపుగా సీబీఐ కోర్టులో లొంగిపోవాలని న్యాయస్థానం ఆదేశించింది. అయితే ఈ ఏడాది జూన్ 30వ తేదీలోపుగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ పూర్తి కానుందున జూలై 1న ఎర్ర గంగిరెడ్డికి బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఇదే సమయంలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్ ఉత్తర్వులపై ఈ నెల 16న వైఎస్ సునీతారెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.