వైఎస్ విజయమ్మతో అవినాష్ రెడ్డి భేటీ.. సీబీఐ విచారణకు ముందు కీలక పరిణామం..!
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్న సంగతి తెలిసిందే. అయితే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు కీలక పరిణామం చోటచేసుకుంది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి ఈరోజు సీబీఐ అధికారుల ఎదుట విచారణకు హాజరుకానున్నారు. అయితే అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యే ముందు కీలక పరిణామం చోటచేసుకుంది. ఈ రోజు ఉదయం అవినాష్ రెడ్డి.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాతృమూర్తి విజయమ్మతో భేటీ అయ్యారు. హైదరాబాద్ లోటస్పాండ్లో విజయమ్మ నివాసం ఉంటున్న ఇంటి వద్దకు వెళ్లిన అవినాష్ రెడ్డి.. ఆమెతో దాదాపు 15 నిమిషాల పాటు భేటీ అయ్యారు. అనంతరం అవినాష్ రెడ్డి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఇక, తాను ఈరోజు సీబీఐ కార్యాలయంలో విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి స్పష్టం చేశారు.
విజయమ్మతో భేటీ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి అంశాలను చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ పరిణామాలు తీవ్ర సంచలనంగా మారే అవకాశాలు కనిపిస్తుంది. ఇదిలా ఉంటే.. వివేకా హత్య కేసుకు సంబంధించి ఆయన కుమార్తె సునీతా రెడ్డి పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఈ రోజు మధ్యాహ్నం సీబీఐ అధికారులు ఎదుట అవినాష్ రెడ్డి హాజరుకానున్నారు. ఈ క్రమంలోనే సీబీఐ అధికారులకు వైఎస్ అవినాష్ రెడ్డి లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ఈ లేఖలో పలు విషయాలకు సంబంధించి ఆయన సీబీఐ అధికారులను రిక్వెస్ట్ చేశారు. తాను సీబీఐ విచారణకు హాజరవుతున్నట్టుగా తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు ప్రారంభమైన దగ్గరనుంచి తన ప్రతిష్టను దెబ్బతీయడానికి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయని తెలిపిన అవినాష్ రెడ్డి.. పనిగట్టుకుని ఓ వర్గం మీడియా లేనిపోని కథనాలను ప్రసారం చేస్తోందన్నారు. తప్పుదోవపట్టించేలా వార్తలను ప్రసారంచేస్తున్నారని అన్నారు. విచారణ పారదర్శకంగా సాగాలని కోరుతున్నట్టుగా చెప్పారు. ఆడియో, వీడియో రికార్డింగుకు అనుమతించాలని.. తనతో పాటు ఒక న్యాయవాది ఉండేందుకు అనుమతి ఇవ్వాలని, తన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోవాలని కోరారు.