ఐదు నిమిషాల్లో ఇంటికి చేరతాడనగా.. అంతలోనే..!
పెద్దపద్మాపురం గ్రామ సమీపంలో ఆటోను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు.
కేవలం ఐదు నిమిషాల వ్యవధిలో ఇంటికి చేరిపోయేవాడు. కానీ అంతలోనే అతనిని మృత్యువు కబళించింది. ద్విచక్రవాహనం పై వెళుతుండగా.. ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకర సంఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం పెద్ద పద్మాపురం గ్రామానికి చెందిన ప్రేమ్ కుమార్(27) సెంటరింగ్ మేస్త్రీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రేమ్కుమార్ రోజులాగే ఆదివారం ఉదయం సెంటరింగ్ పనికోసం ద్విచక్ర వాహనంపై హిరమండలం మండలం ధనుపురం గ్రామానికి వెళ్లాడు. పని ముగించుకుని సాయంత్రం తిరిగి వస్తుండగా పెద్దపద్మాపురం గ్రామ సమీపంలో ఆటోను తప్పించబోయి ద్విచక్ర వాహనంపై నుంచి పడిపోయి తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే స్థానికులు వెంటనే 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వచ్చి క్షతగాత్రుడ్ని పాతపట్నం సీహెచ్సీకి తరలించారు.
అయితే ప్రేమ్కుమార్ అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు శ్రీధర్ ధ్రువీకరించారు. మృతునికి భార్య నీరజ, కుమారై శరణ్య (1) ఉన్నారు. భర్త మృతదేహంపై పడి భార్య రోదించిన తీరు స్థానికులను కలచి వేసింది. మృతదేహన్ని పోస్టుమార్టం కోసం తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.