ట్రాఫిక్ కానిస్టేబుల్ పై దాడి..!
అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శేఖర్ వారిని ఆపారు. దీంతో నాగరాజు ఒక్కసారిగా కానిస్టేబుల్పై పిడిగుద్దులు కురిపించాడు.
నిబంధనలు ఉల్లంఘిస్తూ డ్రైవింగ్ చేస్తున్నందుకు అడ్డుకున్నాడని.. విధుల్లో ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ పై ఓ యవకుడు దాడి చేశాడు. ఈసంఘటన విజయవాడలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
మూడో పట్టణ ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు చెందిన కానిస్టేబుల్ శేఖర్బాబు గురువారం సాయంత్రం డాబా కొట్ల సెంటర్లో విధులు నిర్వర్తిస్తుండగా సింగ్నగర్ లూనా సెంటర్ ప్రాంతానికి చెందిన కొప్పుల నాగరాజు, మరో ఇద్దరు బైక్పై వస్తున్నారు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ ఎస్ఐ సత్యనారాయణ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ శేఖర్ వారిని ఆపారు. దీంతో నాగరాజు ఒక్కసారిగా కానిస్టేబుల్పై పిడిగుద్దులు కురిపించాడు. ఫలితంగా శేఖర్ గాయపడ్డాడు.
అనంతరం ముగ్గురూ బైక్పై పరారయ్యేందుకు యత్నిస్తుండగా పోలీసులు నాగరాజును పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ సమయంలో నాగరాజు ఎస్ఐతోనూ వాగ్వాదానికి దిగాడు. మిగిలిన ఇద్దరూ పరారీలో ఉన్నారు. కానిస్టేబుల్ శేఖర్ ఫిర్యాదు మేరకూ అజిత్సింగ్నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.