కాకినాడలో విషాదం... పెళ్ళిపీటలెక్కాల్సిన జంటను బలితీసుకున్న రోడ్డుప్రమాదం
మరో పదిహేను రోజుల్లో పెళ్లిచేసుకోవాల్సిన యువ జంట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషాద ఘటన కాకినాడలో చోటుచేసుకుంది.
![Young couple death in road accident at Kakinada District AKP Young couple death in road accident at Kakinada District AKP](https://static-ai.asianetnews.com/images/01g53j8f8qqyb4f9a0y9chj62b/t33_363x203xt.jpg)
కాకినాడ : పెళ్లి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలన్న వారి కలలను రోడ్డు ప్రమాదం చిదిమేసింది. నిశ్చితార్థం జరిగి పెళ్లికి మూహూర్తం కూడా ఖరారయ్యింది. పెళ్లిపనులు జరుగుతున్న సమయంలో సరదాగా బయటకు వెళ్లిన యువజంట రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. ఇలా జీవితాంతం కలిసి బ్రతకాలనుకున్న జంట కలిసి మృత్యువాతపడ్డారు. ఈ హృదయవిదారక ఘటన కాకినాడ జిల్లాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం జె.కొత్తూరు గ్రామానికి చెందిన రాజ్ కుమార్(25)కు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారు. దీంతో అమ్మాయిలను చూడటం ప్రారంభించగా కిర్లంపూడి మండలం సోమవరానికి చెందిన దుర్గాభవాని(18) అందరికీ నచ్చింది. రాజ్ కుమార్, దుర్గాభవాని ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడటంతో వెంటనే నిశ్చితార్థం కూడా చేసారు. వచ్చే నెల(మే) 10 న వీరి పెళ్లికి ముహూర్తం కూడా ఖరారుచేసారు.
పెళ్లికి మరో పదిహేను రోజులు మాత్రమే సమయం వుండటంతో పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే నిన్న(మంగళవారం) ఈ రాజ్ కుమార్, దుర్గాభవాని సరదాగా బయటకు వెళ్లాలని అనుకున్నారు. బైక్ పై తూర్పు గోదావరి జిల్లా గౌరీపట్నం మేరీమాత ఆలయానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యలో వీరి బైక్ ను వెనకనుండి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో తీవ్ర గాయాలపాలైన ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. దీంతో పెళ్లిబాజా మోగాల్సిన ఇంట చావుభాజ మోగుతోంది.
Read More కోరిక తీర్చలేదని ప్రియురాలిపై వేడినూనె పోసి.. బంధించి, పలుమార్లు అత్యాచారం.. యువకుడి అరెస్ట్..
యువ జంట మృతితో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన వారిని పాడె ఎక్కిచాల్సి రావడం అందరినీ కలచివేస్తోంది. ఇక చేతికందివచ్చిన బిడ్డలు ఇలా విగతజీవులుగా పడివుండటం చూసి ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని రాజ్ కుమార్, భవాని మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిని ఢీకొట్టిన తర్వాత లారీ ఆగకుండా వెళ్లిపోయిందని... దీన్ని గుర్తించే ప్రయత్నంలో వున్నామని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.