ఏపీ సీఎం వైఎస్ జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం గ్రామ పంచాయతీ ఎన్నికలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. టీడీపీకి కేవలం ఆరు వార్డులు మాత్రమే దక్కాయి.

కడప: కడప జిల్లాలోని పులివెందుల గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ విజయఢంకా మోగించింది. ఆదివారం జిరగిన చివరి విడత ఎన్నికల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శాసనసభ నియోజకవర్గంలోని నూటికి నూరు శాతం సర్పంచ్ స్థానాలను వైసీపీ మద్దతుదారులు దక్కించుకున్నారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ప్రతిపక్ష టీడీపీ మద్దతుదారులు ఈ నియోజకవర్గంలో ఒక్క పంచాయతీని కూడా దక్కించుకోలేకపోయింది. టీడీపీకి చెదిన ఎమ్మెల్సీ, నియోజకవర్గం ఇంచార్జీ బిటెక్ రవి సొంత పంచాయతీ కసనూరులో కూడా టీడీీప మద్దతుదారుడు అధికార వైసీపీ మద్దతుదారుకు పోటీ కూడా ఇవ్వలేని స్థితిలో పరాజయం పాలయ్యాడు. 

పులివెందుల శానససభా నియోజకవర్గంలో 108 పంచాయతీలకు ఎన్నికలు జరగగా 16వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు నాటికి 90 పంచాయతీలను వైసీపీ మద్దతుదారులు ఏకగ్రీవంగా గెలుచుకున్నారు. ఐదు మండలాల్లోని 18 పంచాయతీలకు ఎన్నికలు జరగగా అన్నింటిలోనూ వైసీపీ మద్దతుదారులు విజయం సాధించారు. 

కేవలం 8 గ్రామ పంచాయతీల్లో మాత్రమే టీడీపీ మద్దతుదారులు పోటీ చేశారు. వాటిలో ఒక్క స్తానాన్ని కూడా గెలుచుకోలేకపోయారు. నంద్యాలపల్లి, పైడిపాలెం, దుగ్గనగారిపల్లె పంచాయతీల్లో మాత్రమే కేవలం ఆరు వార్డులను మాత్రమే టీడీపి దక్కించుకుంది.

కాగా, గ్రామ పంచాయతీ నాలుగో విడత ఎన్నికల ఫలితాలు ఆదివారం సాయంత్రం వెలువడ్డాయి. అత్యధిక స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. నాలుగు విడతల్లో జిరగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో 13,097 స్థానాలను వైసీపీ మద్దతుదారులు గెలుచుకున్నారు. రాష్ట్రంలో మొత్తం 13,371 గ్రామ పంచాయతీలు ఉన్నాయి.