వైసీపీ ఎంపీపీ భర్త దారుణం.. టీడీపీ కార్యకర్త పై కారం చల్లి, ఇనుప రాడ్లతో దాడి…
ఆంధ్రప్రదేశ్ లో దారుణం జరిగింది. టీడీపీ కార్యకర్తమీద వైసీపీ వర్గీయులు దాడికి దిగారు. తీవ్రంగా గాయపరిచి, చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లిపోయారు.
రొంపిచర్ల : పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలం అలవాల గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్త కాకాని యేసురాజుపై వైసిపి వర్గీయులు కారం చల్లి, ఇనుపరాడ్లతో దాడి చేసిన సంఘటన ఆదివారం జరిగింది. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం కాకాని ఏసురాజు ఆదివారం ఉదయం బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం కామేపల్లిలో ఇంటి నిర్మాణ పనుల కోసం వెళ్ళాడు. అక్కడి నుంచి మరో ఇద్దరితో కలిసి ద్విచక్రవాహనంపై అలవాల తిరిగి వస్తుండగా.. తురిమెళ్ల- అచ్చయ్య పాలెం గ్రామాల మధ్యకు రాగానే వైసీపీకి చెందిన 11మంది ద్విచక్ర వాహనాన్ని అడ్డగించారు. ఏసురాజుపై కారం చల్లి ఇనుప రాడ్లు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు.
తీవ్రంగా గాయపడిన యేసురాజును అక్కడే వదిలి పరారయ్యారు. బాధితుడు బంధువులకు ఫోన్ చేయడంతో వారు వచ్చి పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు వైద్యశాలలో చేర్పించారు. బాధితుల ఫిర్యాదుమేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
చనిపోయాడనుకుని..
కూలిపనికి వెళ్లి తిరిగిఇంటికి వస్తున్న ఏసురాజుపై రొంపిచర్ల ఎంపీపీ భర్త గడ్డం వెంకట్రావ్, వాలంటీర్లు గోపాల్, నాగరాజు, మరి కొందరు కారం చల్లి, ఇనుప రాడ్లు, బండరాళ్లతో తీవ్రంగా కొట్టారని క్షతగాత్రుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఆరోపించారు. యేసు రాజు చనిపోయాడనుకుని వదిలేసి వెళ్లారు అన్నారు. యేసు రాజు భార్య మరియకుమారి, తల్లి సింగమ్మ నరసరావుపేట ఏరియా ఆస్పత్రి ఆవరణలో విలేకరులతో మాట్లాడారు. టీడీపీ నేత కుమార్ అరవింద బాబుకు మద్దతు తెలిపినందుకు తమ కుటుంబంపై ఎంపీపీ భర్త వెంకట్రావు కక్షపెంచుకున్నారని తెలిపారు.
యేసు రాజును హత్య చేసేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. ఇటీవల అలవాలలో తిరుణాల సందర్భంగా చోటు చేసుకున్న చిన్న వివాదంలో ఏసు రాజుపై హత్యాయత్నం కేసు పెట్టి వేధించారని తెలిపారు. రొంపిచర్ల ఎస్సై అండదండలతో వైసిపి కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.