పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలంటూ వైసిపి ఎంపిలు డిమాండ్ చేశారు.

పోలవరం నిర్మాణాన్ని కేంద్రమే చేపట్టాలంటూ వైసిపి ఎంపిలు డిమాండ్ చేశారు. శుక్రవారం ఢిల్లీలో ఇదే విషయమై ఎంపిలు కేంద్ర జనలవరుల శాఖమంత్రి నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. ఆ సందర్భంగా ఎంపిలు మాట్లాడుతూ, 2019 విభజన చట్టం ప్రకారం పోలవరం ప్రాజెక్టును కేంద్రమే పూర్తి చేయాలన్న విషయాన్ని గుర్తు చేశారు.

పోలవరంపై ఇచ్చిన హామీ అమలు అయ్యేటట్లు కేంద్రం చర్యలు తీసుకోవాలని ఎంపీలు విజ్ఞప్తి చేశారు. అలాగే పోలవరం ప్రాజెక్ట్‌ పనులను వేగవంతం చేయాలని అన్నారు. గడ్కరీని కలిసినవారిలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి, వరప్రసాద్‌, అవినాశ్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

భేటీ అనంతరం వైఎస్‌ఆర్‌ సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ, ‘పోలవరం ప్రాజెక్ట్‌ అక్రమాలపై విచారణ చేయాలని డిమాండ్ చేసారు. ఈ ప్రాజెక్టుకు ఎంత వ్యయమైనా కేంద్ర మే భరించాలన్నారు. 2019 ఎన్నికలలోపే పోలవరం ప్రాజెక్టును యుద్ద ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అలాగే, దుగ్గరాజపట్నం పూర్తి చేయాలని కూడా గడ్కరీని కోరినట్లు మేకపాటి చెప్పారు. అలాగే డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేశామన్నారు. ప్రైవేటీకరణ వల్ల జాతీయ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేసారు. డ్రెడ్జింగ్‌ కార్పొరేషన్‌ ఉద్యోగులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ‘తమ రాజీనామాలతో ప్రత్యేక హోదా వస్తుందంటే ఈ క్షణమే పదవులు వదులుకుంటాం.’ అని అన్నారు.