ఆంధ్రప్రదేశ్ లో ఓ వైసీపీ ఎంపీ సైబర్ క్రైం ఉచ్చులో చిక్కాడు. ఫోన్ కు మెసేజ్ పెట్టి ఆయన అకౌంట్ నుంచి దాదాపు లక్ష రూపాయల దాకా నొక్కేశారు.
కర్నూలు : కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ సైబర్ నేరగాడి వలలో పడి మోసపోయారు. మీ బ్యాంకు ఖాతా బ్లాక్ అయ్యిందని.. వెంటనే పాన్ నెంబర్ తో జత చేసి అప్డేట్ చేసుకోవాలంటూ సోమవారం ఓ మొబైల్ నెంబర్ నుంచి ఆయన సెల్ కు మెసేజ్ వచ్చింది. దీంతోపాటు లింకు పంపించారు. ఆయన దానిని నమ్మి లింకులో వివరాలను నమోదు చేసి పంపగా ఓటీపీ నెంబర్ లు వచ్చాయి. ఆ తర్వాత అపరిచిత వ్యక్తి ఫోన్ చేసి హెచ్ డిఎఫ్ సి బ్యాంక్ కస్టమర్ కేర్ నుంచి మాట్లాడుతున్నట్లు పరిచయం చేసుకున్నాడు.
అకౌంట్ ఇతరత్రా వివరాలు, ఓటీపీ నెంబర్ లు అడిగి తెలుసుకున్నాడు. వివరాలన్నీ చెప్పిన వెంటనే ఎంపీ బ్యాంకు ఖాతా నుంచి రూ.48,700 ఒకసారి, రూ.48,999 మరోసారి డ్రా అయినట్లు సెల్ ఫోన్ కి మెసేజ్ లో సమాచారం వచ్చింది. దాంతో అనుమానం వచ్చి బ్యాంకుకు ఫోన్ చేయగా అసలు విషయం తెలిసింది. దాంతో సైబర్ నేరగాడు తనను మోసగించి మొత్తం రూ.97,699 తన అకౌంట్ నుంచి కాల్ చేసినట్లు ఎంపీ సంజీవ్ కుమార్ కర్నూలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో సోమవారం రాత్రి ఫిర్యాదు చేశారు. సిఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇలాంటి మోసాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ‘సార్.. మేము బ్యాంక్ నుంచి కాల్ చేస్తున్నాం. మీ ఏటీఎం బ్లాక్ అయ్యింది. మీ కార్డు వివరాలు చెప్తే మీ కార్డును తిరిగి అన్ బ్లాక్ చేస్తాం. అలాగే మీకు ఒక మెసేజ్ వస్తుంది. అందులో ఉన్న నెంబర్ మాకు చెప్పాల్సి ఉంటుంది.’’ అని తరచూ ప్రజలకు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేస్తుంటారు. నిజంగా బ్యాంక్ అధికారులే కాల్ చేస్తున్నారనుకొని వారు అడిగిన వివరాలు అన్నీ చెప్తే.. అకౌంట్ నుంచి డబ్బులు మాయం అవడం ఖాయం. ఇలా ఇప్పటి వరకు ఎంతో మంది అమాయకులు మోసపోయారు. ‘‘ సార్ మీకు లాటరీ వచ్చింది. అయితే వాటిని మీ అకౌంట్లో వేయాలంటే ఇండియన్ రూల్స్ ఒప్పుకోవడం లేదు. దీని కోసం మీరు కొంత అమౌంట్ చెల్లిస్తే, ఆ నిబంధనలకు అనుమతి లభిస్తాయి.’’ అంటూ కాల్స్ వస్తాయి.
వీటిని నమ్మిన చాలా మంది నిజమే అనుకొని వారు అడిగిన డబ్బుల్నీ వారికి ట్రాన్స్ ఫర్ చేస్తారు. డబ్బులు పంపిన తరువాత వారికి కాల్ చేస్తే కలవదు. లాటరీ రాదు. ఇలాంటి ఘటనలు ప్రతీ రోజు మనం పేపర్లలలో చదువుతుంటాం. ఇలా టెక్నాలజీల పెరిగిన కొద్ది మోసం చేసే విధానాలు కూడా పెరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఇలాంటి నేరం కాదు .. దీనికి భిన్నంగా కొత్తరకంగా మోసాలు పెరిగిపోయాయి. ఇలాంటి సైబర్ మోసాలు. ఎప్పుడూ వెలుగులోకి రాలేదు. కేవలం ఒక్క మిస్డ్ కాల్ రావడంతో ఓ వ్యక్తి లక్షలు పోగొట్టుకున్నాడు. అసలేం జరిగిందో తెలుసుకునేలోపే రూ. 46 లక్షలు అతడి అకౌంట్ నుంచి మాయమయ్యాయి.
