ఇవాళ(ఆదివారం) ఉదయం అనారోగ్యంతో మరణించిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని కాస్సేపట్లో సీఎం జగన్ పరామర్శించనున్నారు.  

అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఇవాళ(ఆదివారం) ఉదయం అనారోగ్యంతో మరణించిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య కుటుంబాన్ని సీఎం పరామర్శించనున్నారు. ఇందుకోసం తాడేపల్లి నుండి బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు కడప చేరుకోనున్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

కడప పట్టణంలోని కో-ఆపరేటివ్‌ సొసైటీ కాలనీలో వెంకటసుబ్బయ్య కుటుంబం నివాసం ఉంటోంది. కడప ఎయిర్‌ పోర్టు నుంచి నేరుగా వెంకటసుబ్బయ్య ఇంటికి చేరుకుని ఆ కుటుంబాన్ని పరామర్శించనున్నారు సీఎం. అనంతరం తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. 

 కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఎమ్మెల్యే సుబ్బయ్య ఇటీవల హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందారు. అయితే ఆరోగ్యం కాస్త కుదుటపడటంతో పాటు రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గానికి చేరుకున్నారు. ఈ క్రమంలో మరోసారి ఆయన అనారోగ్యానికి గురవడంతో కడపలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చేరారు. అయితే ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో తుదిశ్వాస విడిచారు. 

 ఎమ్మెల్యే సుబ్బయ్యకు భార్య, ఇద్దరు పిల్లలు వున్నారు. ఆయన మృతితో ఆయన కుటుంబంలోనే కాదు పార్టీలోనూ విషాదం నెలకొంది. ఆయన మృతి పట్ల పలువురు వైకాపా నేతలు, కార్యకర్తలు సంతాపం తెలిపారు.