రాష్ట్రంలో దుశ్శాసన పాలన నడుస్తోంది
- చంద్రబాబునాయుడు పాలనపై వైసిపి ఎంఎల్ఏ రోజా నిప్పులు చెరిగారు
చంద్రబాబునాయుడు పాలనపై వైసిపి ఎంఎల్ఏ రోజా నిప్పులు చెరిగారు. గడచిన మూడున్నరేళ్ళుగా చంద్రబాబు పాలనలో మహిళలకు జరుగుతున్న అన్యాయాలు, అవమానాలపై తీవ్రస్ధాయిలో ధ్వజమెత్తారు. మూడున్నరేళ్ళల్లో ఎంతమంది మహిళలు, విద్యార్ధినులు ఏ విధంగా నష్టపోయారో వివరించారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలోని పెందుర్తి మండలం జెర్రిపోతుల గ్రామంలో ఎస్సీ మహిళను టిడిపి నేతలు బట్టలూడదీసిన ఘటనను గుర్తు చేసారు. ఆ ఘటనపై చంద్రబాబు ఇంత వరకూ ఎందుకు స్సందించలేదని నిలదీసారు.
అదే సమయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో మహిళలకు దక్కిన గౌరవాన్ని కూడా వివరించారు. వైఎస్ తన మంత్రివర్గంలో ఐదుగురు మహిళలకు కీలకమైన పదవులు ఇస్తే, చంద్రబాబు ఇద్దరిని మాత్రమే తీసుకున్నట్లు గుర్తు చేసారు. రాష్ట్రంలో దుశ్శాసన పాలన నడుస్తోందని తేల్చేసారు. మహిళల సదస్సు నిర్వహించినపుడు తనకు జరిగిన అవమానాన్ని గురించి ప్రస్తావించారు. పేరుకు మాత్రమే మహిళా సదస్సు నిర్వహించి ప్రతిపక్షాల్లోని మహిళా నేతలను కనీసం పిలవను కూడా పిలవలేదన్నారు. తనకు భజన చేసే బంధువులను మాత్రమే పిలుచుకుని సదస్సు నిర్వహించారని ఎద్దేవా చేసారు.