వైసీపీ ఎమ్మెల్యే వసంత నాగేశ్వరరావు తన తండ్రి మీద వ్యాఖ్యలు చేశారు. ఆయన నోరు చాలా ప్రమాదకరమని, ఆయనతో తాను ఏకీభవించనని అన్నారు. 

మైలవరం : మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తన తండ్రిమీద విరుచుకుపడ్డారు. అమరావతి రాజధానిగా ఉండాలని.. దీనికి మద్దతుగా తన తండ్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలతో తాను ఏకీభవించడం లేదన్నారు. ఆ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నట్లు ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తెలిపారు. దీంతోపాటు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును కూడా తన తండ్రి తప్పుపట్టాడని చెప్పుకొచ్చాడు. దానికి కూడా తాను సమర్థించనని మైలవరం వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

రాజధాని విషయంలో తన వ్యక్తిగత అభిప్రాయం ముఖ్యం కాదని, అది ఎలా ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయమే తనకు శిరోధార్యమని ఆయన స్పష్టం చేశారు. తన తండ్రి వసంత నాగేశ్వరరావు ఇరుకున పెడతారని, ఆయన నోరు చాలా ప్రమాదకరమని, ఎప్పుడూ ఎవరో ఒకరిని తన మాటలతో ఇరకాటంలో పడేస్తారని.. అది ఆయన నైజం అని వసంత కృష్ణ ప్రసాద్ వ్యాఖ్యానించారు.

ఎవరెన్ని చెప్పినా, ఏం చేసినా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితోనే తన ప్రయాణం సాగుతుందని స్పష్టం చేశారు. కొందరు కావాలనే ఉద్దేశపూర్వకంగానే పార్టీలో గందరగోళ వాతావరణం నెలకొల్పే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. 2024 ఎన్నికల్లో కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పోటీ చేయమంటే చేస్తానన్నారు. వద్దంటే పోటీ చేయనని వైసీపీ పార్టీ కోసం పని చేస్తానని చెప్పుకొచ్చారు. 

కళ్లు తెరిచిన అమ్మవారి విగ్రహం.. కడియపు లంకకు క్యూ కట్టిన భక్తులు, వీడియో వైరల్

తాను ఎంతోమందికి అవకాశాలు ఇప్పించానని.. వారు కూడా ఇప్పుడు తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని వాపోయారు. తనకు జోగి రమేష్ ఉన్న విభేదాల విషయంలో కూడా చెప్పుకొచ్చారు. ఈ విషయం అధిష్టానంతో చర్చించిన తర్వాతే మీడియాతో మాట్లాడతానని చెప్పారు. తాను కాస్త అనారోగ్యంతో ఉన్నానని అందుకే ఇటీవల కాలంలో పార్టీ అధికారిక కార్యక్రమంలో పాల్గొనలేకపోయానన్నారు. మైలవరంలో పార్టీ అభ్యర్థిని మారిస్తే.. ఆ మార్చిన అభ్యర్థికి మద్దతుగా తాను నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో పనిచేస్తానని వెల్లడించారు.

ఇదిలా ఉండగా, కమ్మ సామాజిక వర్గంపై మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. కమ్మ సంఘం సమావేశాల్లో సీనియర్ అయిన వసంత నాగేశ్వరరావు వ్యాఖ్యలు సరికాదని అన్నారు. గత టీడీపీ హయాంలో మైనార్టీ, ఎస్టీలకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని.. ప్రాధాన్యత ప్రకారమే ఏ వర్గానికైనా పదవులు వస్తాయని కొడాలి నాని పేర్కొన్నారు. ఒక్క కమ్మ సామాజిక వర్గానికే పదవులు ఇవ్వడం లేదని అనడం సరి కాదని అన్నారు. డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ ఆశయాలు ప్రకారం సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకే పదవులు కేటాయించారని ఆయన సూచించారు.

కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన వన సమారాధన లో వసంత నాగేశ్వరరావు రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో కమ్మ వర్గానికి అన్యాయం చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పును ఎవరు అడ్డుకోలేక పోవడం విచారకరమని అన్నారు. రాష్ట్ర కేబినెట్లో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి వసంత నాగేశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. పొరుగున ఉన్న తెలంగాణలో కమ్మ సామాజిక వర్గానికి చెందిన మంత్రి ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ఇతర సామాజిక వర్గాల పల్లకిలను ఇంకెంతకాలం మోస్తారని వసంత నాగేశ్వర రావు ప్రశ్నించారు.