మహిళలపై కర్కశంగా కంకర పోశారు... నారా లోకేష్ ట్వీట్.. మండిపడుతున్న వైసీపీ..
శ్రీకాకుళంలో దాయాదులు ఇద్దరు మహిళలపై కంకరపోయాడాన్ని టీడీపీ నేత నారా లోకేష్ దుయ్యబట్టారు. ప్రభుత్వ వైఫల్యం కారణంగానే ఇలాంటివి జరుగుతున్నాయన్నారు. దీనిమీద వైసీపీ విరుచుకుపడుతోంది.
శ్రీకాకుళం : మండలంలోని హరిపురంలో స్థల వివాదం ముదిరి సోమవారం ఇద్దరు మహిళలపై కంకర పోసేవరకూ వెళ్ళింది. రామారావు, ప్రకాశరావు, ఆనందరావులతో సమీప బంధువులైన కొట్ర దాలమ్మ, మజ్జి సావిత్రిలకు ఓ ఇంటి స్థలం విషయమై ఎప్పటినుంచో వివాదం ఉంది. వీరి మధ్య ఊరి పెద్దలు కూడా రాజి కుదర్చలేకపోయారు. హరిపురంలో స్థలాల ధరలు విపరీతంగా పెరగడంతో ఎవరికి వారే పట్టుదలకు పోయారు.
ఈ నేపథ్యంలోనే సోమవారం ఈ వివాదం మరింత ముదిరింది. రామారావు, ఆనందరావు, ప్రకాశరావులు ట్రాక్టర్లతో వివాద స్థలంలో కంకర వేస్తుండగా.. దాలమ్మ, సావిత్రి అడ్డుకున్నారు. దీంతో ట్రాక్టర్ల వెనకున్న వీరిద్దరిపై అమాంతం మట్టిని కుమ్మరించేశారు. దీంతో వీరిద్దరూ నడుంలోతు వరకు కంకరలో కూరుకుపోవడంతో పెద్దగా రోదించారు. కేకలు విన్న చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని.. పారలతో కంకరను తీసి మహిళలను బయటికి లాగారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలకు ఉపక్రమించారు.
శ్రీకాకుళంలో అమానుషం... తల్లీకూతుళ్లను మట్టిలో నడుంలోతు పూడ్చిన దాయాదులు
కుటుంబాల మధ్య గొడవల్ని.. రాజకీయం..
అయితే, ఈ వివాదం మీద నారాలోకేష్ స్పందించడం.. దీన్ని వైఎస్సార్పీకీ అంటగట్టడం మీద ఆ పార్టీ నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రెండు కుటుంబాల మధ్య నడుస్తున్న వివాదం ఇది. టిడిపి హయాంలో కూడా ఇది కొనసాగింది. 2017, 2019లో ఆ ప్రభుత్వ హయాంలోనే బాధిత మహిళలు నిరాహార దీక్షలు చేశారు. అప్పుడు అధికారులు, గ్రామపెద్దలు కూడా ఈ సమస్యను పరిష్కరించలేదు, అయినా గొడవలు ఆగలేదు. దీంతో కేసు కోర్టు వరకు చేరింది. ప్రస్తుతం ఈ వ్యవహారం కోర్టులో నడుస్తుంది. ఈ క్రమంలో వారి మధ్య కొనసాగుతున్న గొడవలో భాగంగా ఒక వర్గం మరో వర్గంపై మట్టిపోశారు. కానీ, కూడా టీడీపీ దీన్ని రాజకీయం చేస్తోంది.
వ్యక్తుల మధ్య జరిగిన గొడవను వైఎస్ఆర్సిపికి అంటగడుతోంది. ముఖ్యంగా పార్టీ నాయకుడు నారా లోకేష్ ట్వీట్ తో పార్టీల మధ్య గొడవగా చిత్రీకరిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఈ గొడవకు లోకేష్ లింకు పెట్టి ట్వీట్లతో రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతున్నారు. బాధితురాలి నుంచి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. స్థానిక ఎస్ఐ బందోబస్తు నిమిత్తం విశాఖలో ఉండడంతో కేసు తీవ్రత దృష్ట్యా వజ్రపుకొత్తూరు ఎస్ఐ మధు, కాశీబుగ్గ సీఐ శంకరరావులు హుటాహుటిన అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ కేసు విషయంలో పోలీసులు ఇంత త్వరగా రియాక్ట్ అయ్యి చేస్తుంటే.. నారా లోకేష్ ఇలా చేయడం హాస్యాస్పదంగా ఉంది అని వైసీపీ వర్గాలు మండిపడుతున్నాయి.