ప్రకాశంలో దారుణం.. నడిరోడ్డుపై లారీతో ఢీకొట్టి వైసీపీ నాయకుడి హత్య..
ప్రకాశం జిల్లాలో వైసీపీ నాయకుడి హత్య ఒకటి కలకలం రేపుతోంది. పార్టీలోని మరో వర్గం వారే ఈ హత్య చేశారన్న ప్రచారం సాగుతోంది.
ప్రకాశం జిల్లా : పాత కక్షల నేపథ్యంలో జాతీయ రహదారిపై ఓ యువకుడిని లారీతో ఢీ కొట్టి కిరాతకంగా హత్య చేసిన సంఘటన ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం కడప గ్రామం వద్ద జాతీయ రహదారిపై గురువారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మూలగుంటపాడు గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు పసుపులేటి రవితేజ(32) అక్కడికక్కడే మృతిచెందాడు. పార్టీలోని మరో వర్గంతో విభేదాలు దీనికి కారణమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.
రవితేజ, అతని మిత్రుడు ఉమా వేరు వేరు ద్విచక్రవాహనాలపై రాత్రి ఎనిమిదిన్నర గంటల సమయంలో కనుమళ్లకు వస్తుండగా.. వెనక నుంచి లారీతో అతడిని ఢీకొట్టడంతో రోడ్డు మీద పడిపోయాడు. లారీ అతడిని తొక్కుకుంటూ వెళ్ళిపోయింది. దీంతో అక్కడికక్కడే మృతిచెందాడు. అతని మిత్రుడు ఉమా లారీని వెంబడించి ఆపడానికి ప్రయత్నించాడు. అయితే అతని పైకి కూడా లారీని ఎక్కించ్చేందుకు డ్రైవర్ ప్రయత్నించగా కొద్దిలో తప్పించుకున్నాడని పోలీసులు తెలిపారు.
నేడు కుప్పంలో జగన్ పర్యటన.. మూడో విడత వైయస్సార్ చేయూత ప్రారంభించనున్న సీఎం...
రవితేజ మూలగుంటపాడులో ఉంటూ అక్కడే ఇసుక వ్యాపారం చేస్తుంటాడు. అతడికి భార్య, ఐదేళ్ల కుమార్తె ఉన్నారు. సింగరాయకొండ మండల పరిషత్ రెండో ఉపాధ్యక్ష పదవి విషయంలో ఎంపీటీసీ సభ్యుడికి, రవితేజకు వివాదం ఉందని స్థానికులు తెలిపారు. హత్యకు అదే కారణం కావచ్చని భావిస్తున్నారు. ఈ హత్య తర్వాత గ్రామంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఒంగోలు నుంచి అదనపు బలగాలను రప్పించారు. గ్రామంలో పికెట్ ఏర్పాటు చేశారు. రవితేజ తండ్రి శ్రీనివాసరావు సోమరాజుపల్లి మాజీ సర్పంచ్.