గాంధీ విగ్రహానికి వైసీపీ రంగులు... తప్పుడు ప్రచారమని నిరూపించిన అధికార పార్టీ
మెరకముడిదాం మండలం భైరిపురం పంచాయతీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ తన తల్లి జ్ఞాపకార్థం గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఉన్న దిమ్మెకు వైఎస్సార్సీపీ జెండా రంగులు వేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
గాంధీ విగ్రహానికి వైసీపీ రంగులు వేశారంటూ... ఇటీవల అధికార పార్టీపై ప్రతిపక్ష పార్టీలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. కాగా.. ప్రతిపక్షాలు చేసినవన్నీ తప్పు అంటూ వైసీపీ ఆధారాలతో సహా నిరూపించింది. గాంధీ విగ్రహానికి వైసీపీ జెండా రంగులను ఫోటో షాప్ లో మార్చి... ప్రతిపక్ష నేతలు సోషల్ మీడియాలో ప్రచారం చేశారని వారు పేర్కొన్నారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... విజయనగరం జిల్లాలో జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహానికి వైఎస్సార్సీపీ రంగులు వేసినట్టు వార్తలొచ్చాయి. మెరకముడిదాం మండలం భైరిపురం పంచాయతీ కార్యాలయంలో మాజీ సర్పంచ్ తన తల్లి జ్ఞాపకార్థం గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఈ విగ్రహం ఉన్న దిమ్మెకు వైఎస్సార్సీపీ జెండా రంగులు వేయించారనే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
ఆ ఫోటోలను మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లు ఇద్దరూ సోషల్ మీడియాలో వాటిని షేర్ చేసి... అధికార పార్టీపై దుమ్మెత్తి పోశారు. త్రివర్ణ పతాకానికి తమ పార్టీ రంగులేసుకొని అభాసులపాలైన వైఎస్సార్సీపీ పాఠాలు నేర్వలేదని బాబు మండిపడగా.. మొన్న జాతీయ జెండా, ఈరోజు గాంధీ విగ్రహం, రేపేంటి జగన్ రెడ్డీ జీ? అని పవన్ ప్రశ్నించారు.
కాగా... పవన్, చంద్రబాబు షేర్ చేసిన ఫోటోలు ఫేక్ అని... అసలు ఫోటో ఇది అంటూ వైసీపీ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు. గాంధీ విగ్రహం ఫొటోలు, వీడియోలను విడుదల చేసింది. వీటిల్లో గాంధీ విగ్రహాన్ని ఉంచిన దిమ్మెకు తెల్ల రంగు మాత్రమే వేసి ఉంది. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఫేక్ ఫొటోలను ట్వీట్ చేశారని తెలిపింది.