భూమా సంతాప తీర్మానాన్ని జగన్ ఎందుకు బహిష్కరించారు
ఒక విషాద ఘడియలో ‘చావు రాజకీయం’ చేయడం ఇష్టం లేదు
నంద్యాల ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి సంతాప తీర్మానాన్ని రాజకీయం చేసి, ప్రతిపక్ష పార్టీ మీద రాళ్లేసేందుకు వాడుకుంటున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు.
భూమా నాగిరెడ్డికి సంతాపం తీర్మానం ప్రవేశపెట్టినపుడు అసెంబ్లీని తాాము ఎందుకు బహిష్కరించవలసిందో జగన్ వివరించారు. .
ఇది కూడా కూడా భూమా మీద తమకున్న గౌరవంతో హుందాగా చేశామని ఆయన వివరణ ఇచ్చారు.
‘ఎన్టీఆర్ లాగానే నాగిరెడ్డిని కూడా చంద్రబాబు మానసిక క్షోభకు గురి చేశారు. భూమా హుందాతనాన్ని కాపాడేందుకే తాము సభకు వెళ్లలేదు. సభకు వెళితే చంద్రబాబు మంత్రి పదవులు ఇస్తానని ప్రలోభ పెట్టడం, భూమా దానికి లోనుకావడం ,ఇంకా ఇతర పనుల గురించి మాట్లాడాల్సి వస్తుంది. అవన్నీ రికార్డుల్లోకి వెళ్తాయి. అందుకే తాము సభకు వెళ్లలేదు,’ అని జగన్ చెప్పారు.
మంగళవారం వైఎస్ జగన్ మాట్లాడుతూ అసెంబ్లీ జరుగుతున్న తీరు చూస్తుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోందని అన్నారు..
తండ్రి మృతి చెందిన 24 గంటల్లోనే అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకురావడం చంద్రబాబు కుసంస్కారానికి నిదర్శనమని, కేవలం చావుని రాజకీయం చేసేందుకే నని ఆయన అన్నారు.
‘నాగిరెడ్డి చనిపోయిన విషయం తెలియగానే అఖిలప్రియతో నేను, అమ్మ ఫోన్లో మాట్లాడాము. మంత్రి పదవి ఆశ చూపినందువల్లే భూమా నాగిరెడ్డి పార్టీ మారారు. . పార్టీ మారిన మూడు రోజుల్లో మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని భూమా మా పార్టీ వారితో చెప్పారు. ఏడాది గడిచినా పదవి ఇవ్వలేదు. అంటే భూమా ఎంత మానసిక క్షోభకు గురయ్యారో అర్థం అవుతుంది,’ అని జగన్ చెప్పారు.
నంద్యాల ఉప ఎన్నికపై సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటామని అంటూ ఆ సీటు తమ పార్టీదే అని, గతంలో ఏ పార్టీవారు మరణిస్తే..గౌరవంగా వాళ్లకే వదిలేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.