అమరావతి నిర్మాణానికి బ్రేకులు: ప్రపంచబ్యాంకు కొర్రీ
అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది అయితే ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంకు స్పష్టం చేసింది.
అమరావతి: అమరావతి నిర్మాణం కోసం నిధులు కావాలంటే తనిఖీలు నిర్వహించాల్సిందేనని ప్రపంచబ్యాంక్ ఏపీ ప్రభుత్వానికి తేల్చి చెప్పింది అయితే ఈ విషయమై తమ అభిప్రాయాన్ని ఈ నెల 23వ తేదీలోపుగా చెప్పాలని ఏపీ ప్రభుత్వానికి వరల్డ్ బ్యాంకు స్పష్టం చేసింది.
రాజధాని నిర్మాణానికి సంబంధించి బ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రం నుండి రాష్ట్రానికి వరల్డ్ బ్యాంకు నుండి సమాచారం అందింది. అయితే ఈ విషయమై తమకు మరింత గడువు కావాలని కేంద్రం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం లేఖ పంపింది.
ప్రపంచబ్యాంక్ ఇన్స్పెక్షన్ ప్యానెల్ తనిఖీలు చేయడం అనేది కొత్త సంప్రదాయమని కేంద్రం భావిస్తోంది. దేశంలో ప్రపంచ బ్యాంకు నిధులతో చేపడుతున్న అన్ని ప్రాజెక్టులకు కూ ఇది ఇబ్బందిగా మారే అవకాశం ఉందని కేంద్రం భావిస్తోంది.
ఈ తరుణంలో అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నిధులను తీసుకెళ్లే ప్రతిపాదనను విరమించుకోవాలని కేంద్రం రాష్ట్రానికి సూచించినట్టుగా తెలుస్తోంది. ఇతర మార్గాల ద్వాారా రాజధాని నిర్మాణానికి నిధులను సమీకరించాలని కేంద్రం సూచించినట్టుగా చెబుతున్నారు.
అమరావతి నిర్మాణం కోసం రూ. 7200 కోట్ల రుణం కోసం సీఆర్డీఏ ప్రపంచబ్యాంకుకు ప్రతిపాదనలు పంపింది. తొలి దశలో రూ. 3200 కోట్లు, రెండో దశలో రూ, 3200 కోట్లు తీసుకోవాలని అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది.
తొలి దశ రుణం తీసుకొనేందుకు నాడు కేంద్రం కూడ అంగీకరించింది. బ్యాంకు సూత్రప్రాయ ఆమోదంతో కొన్ని ప్రాధాన్య మౌలిక వసతుల కల్పన పనుల్ని సీఆర్డీఏ చేపట్టింది. ప్రపంచబ్యాంకు నిధులతో చేపడుతున్న ప్రాజెక్టులు తమ ప్రయోజనాలకు విఘాతం కల్గిస్తున్నాయని రాజధానికి చెందిన కొందరు బ్యాంకు ఇన్స్పెక్షన్ ప్యానెల్కు 2017 మే 25న ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు ప్రపంచబ్యాంకు టీమ్ అమరావతికి వచ్చింది.
అధికారులు, స్థానికులతో మాట్లాడింది. ప్రపంచబ్యాంకుకు ప్రాథమిక నివేదికను ఇచ్చింది. పూర్తి స్థాయి నివేదికకు ఇన్స్పెక్షన్ అవసరమని సిఫారసు చేసింది.ఈ సమయంలోనే ప్రభుత్వం మారింది. ఈ విషయమై తమకు గడువు కావాలని ప్రభుత్వం కోరింది. కానీ విషయమై ప్రపంచబ్యాంకు నుండి ఎలాంటి సమాచారం రాలేదు.