వైసీపీ నేత ఇంటి ముందు ఆందోళన..మోసం చేశాడంటూ..
విజయవాడలో వైసీపీ నేత గౌతం రెడ్డి ఇంటి ఎదుట ఇద్దరు తల్లీకొడుకులు ఆందోళన చేపట్టారు.
విజయవాడలో వైసీపీ నేత గౌతం రెడ్డి ఇంటి ఎదుట ఇద్దరు తల్లీకొడుకులు ఆందోళన చేపట్టారు. తమ స్థలాన్ని లాక్కొన్ని తమకు తీరని అన్యాయం చేశారని వారు ఆరోపించారు. నకిలీ డ్యాక్యుమెంట్లు సృష్టించి కోట్ల విలువచేసే స్థలం కబ్జా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. మూడేళ్లుగా న్యాయం కోసం తాము పోరాడుతున్నామని.. అయినప్పటికీ న్యాయం జరగలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
పూర్తి వివరాల్లోకి వెళితే... విజయవాడకు చెందిన గండూరి విజయలక్ష్మి, ఆమె కుమారుడు గండూరి ఉమామహేశ్వరరావు సోమవారం ఉదయం వైసీపీ నేత గౌతంరెడ్డి ఇంటి వద్ద ఆందోళన చేపట్టారు. తమస్థలాన్ని గౌతంరెడ్డి కబ్జా చేశారంటూ వారు ఆరోపించారు. భగత్సింగ్ రోడ్డులోని కోట్లవిలువ చేసే 325 గజాల స్థలం తన తల్లిదని ఉమామహేశ్వరరావు తెలిపారు.
గౌతంరెడ్డి ఇంటి ఎదురుగా ఉన్న తమ స్థలంలో నిర్మించిన షెడ్డులోకి వెళ్లేందుకు ప్రయత్నించగా ఆయన అనుచరులు తలుపులు వేసేశారని తల్లీకొడుకులు ఆరోపిస్తున్నారు. కాగా.. బాధితులకు టీడీపీ నేతలు అండగా నిలిచారు. జోరుగా వర్షం కురుస్తున్నప్పటికీ బాధితులు తమ ఆందోళనను కొనసాగించారు.