విశాఖపట్నం జిల్లా అరకులోయలో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ తన ముగ్గురు పిల్లలను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకుంది. అయితే, అల్లుడు చంపాడని మహిళ తండ్రి ఆరోపిస్తున్నారు.

విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అరకులో విషాదకరమైన సంఘటన చోటు చేసుకుంది. ఓ తల్లి తన ముగ్గురు పసి పిల్లలను కడతేర్చి, అనంతరం తాను ఆత్మహత్య చేసుకున్న హృదయ విధారకర ఘటన శుక్రవారం మండల కేంద్రంలోని పాత పోస్టాపీసు కాలనీలో చోటు చేసుకుంది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

అరకులోయ మండలంలోని శిమిలిగూడ గ్రామానికి చెందిన సంజీవ్(38) సురేఖ(34) భార్య భర్తలు, వీరికి సుసన(10), సర్వీన్(8), సిరీల్(4) అనే ముగ్గురు బిడ్డలు ఉన్నారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు వీరిద్దరి దాంపత్య జీవితంలో మనస్పర్థలు చోటు చేసుకోవడంతో గతకొన్ని రోజులుగా కుటుంబ కలహాలతో ఉన్నట్లు తెలుస్తుంది.

భార్యాభర్తల మధ్య వాగ్వాదం అధికమవడంతో తీవ్ర మనస్తా పానికి గురైన సురేఖ తన భర్త ఇంట్లో లేని సమయంలో, తన ముగ్గురు పిల్లలకు విషపూరిత ఆహారం పెట్టి కడతేర్చగా, అనంతరం తానూ కూడా షీలింగ్ ఫ్యాన్ కు ఉరేసుకుంది. మనసు కలిచివేసే ఈ ఘటనతో మండల కేంద్రంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి!

విషయం తెలుసుకున్న అరకు శాసనసభ్యులు చెట్టి పాల్గుణ హుటా హుటిన ఘటనా స్థలానికి చేరుకొని, విగత జీవులుగా పడివున్న చిన్నారుల మృతదేహాలను చూసి, చలించి, కన్నీటి పర్యంతమ య్యారు. తదుపరి ఆయన పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని, మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.

కాగా, శుక్రవారం రాత్రి సురేఖ ఇంట్లో ఉరికి వేలాడుతూ కనిపించింది. ముగ్గురు పిల్లల శవాలు మంచం మీద పడి ఉన్నాయి. తన భార్య ముగ్గురు పిల్లలకు విషం పెట్టి చంపి, తాను ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుందని సంజీవ్ చెబుతున్నాడు. సురేఖ తండ్రి లక్ష్మయ్య మాత్రం అల్లుడే వారిని చంపేశాడని ఆరోపిస్తున్నాడు.