ఇద్దరు పిల్లలతో కలిసి తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషాద ఘటన గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది. 

తాడేపల్లి: కుటుంబ కలహాలతో ఎంత మానసిక క్షోభ అనుభవించిందో ఆ తల్లి. కడుపున పుట్టిన బిడ్డలతో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ దారుణం గుంటూరు జిల్లా తాడేపల్లిలో చోటుచేసుకుంది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

విజయవాడకు చెందిన రుద్రారపు శాంతిప్రియ ఇద్దరు పిల్లలతో కలిసి బకింగ్ హాం కెనాల్ లో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మొదట ఇద్దరు పిల్లలను కెనాల్ లోకి తోసేసి ఆ తర్వాత తాను కూడా దూకేసింది. అక్కడే చేపలుపడుతున్న జాలర్లు ఇదంతా గమనించి వెంటనే అప్రమత్తమై ముగ్గురినీ సురక్షితంగా కాపాడారు.

వీడియో

వీరిని ఒడ్డుకు చేర్చిన తర్వాత తాడేపల్లి పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వారు వెంటనే ఘటనా స్ధలానికి చేరుకుని బాధిత మహిళను, పిల్లలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి కౌన్సెలింగ్ ఇచ్చారు. కుటుంబ కలహాలతో తీవ్ర మనోవేధనకు గురయి ఈ నిర్ణయం తీసుకున్నామని మహిళ పోలీసులకు తెలిపింది. దీంతో మహిళ కుటుంబసభ్యులను కూడా పోలీస్ స్టేషన్ కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి వారివెంట మహిళను, పిల్లలను పంపించారు.