ఒకరికి తెలియకుండా మరొకరితో వివాహేత సంబంధం ఆమె ప్రాణాలను బలి తీసుకుంది. కోపంతో ప్రియుడు గట్టిగా కొట్టడంతో తలుపుకున్న కోను తగిలి చనిపోయింది. 

విజయనగరం : రామభద్రపురం మండలంలోని ముచ్చర్ల వలసలో ఇటీవల అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన వివాహిత రమణమ్మ కేసులో.. వివాహేతర సంబంధం కారణంగా ఆమె హత్యకు గురైనట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ నెల 10వ తేదీన అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆమె తల వెనుక భాగంలో బలంగా కొట్టడంతో తీవ్రంగా గాయాలపాలై రక్తపు మడుగులో కిందపడింది. దీంతో కుటుంబసభ్యులు బాడంగి ఆస్పత్రిలో ప్రథమ చికిత్స చేయించి.. ఆ తర్వాత విజయనగరం కేంద్ర ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది.

హతురాలి తల్లి బంటు చిన్నమ్మ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు సీఐ శోభన్ బాబు ఆధ్వర్యంలో ఎస్ఐ కృష్ణమూర్తి బృందం దర్యాప్తు చేసి అన్ని కోణాల్లో విచారణ చేసింది. ఈ విచారణలో వివాహేతర సంబంధమే రమణమ్మ హత్యకు కారణమని తెల్చారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ శోభన్ బాబు మాట్లాడుతూ.. దాలి రమణ (35)కు అదే గ్రామానికి చెందిన నడగాన రమణతో కొన్నేళ్ల నుంచి వివాహేతర సంబంధం ఉంది. అలాగే అదే గ్రామానికి చెందిన మరో వ్యక్తితో కూడా వివాహేతర సంబంధం పెట్టుకుంది. మొదటి ప్రియుడు రమణ సారా వ్యాపారి.

ఈ నెల 10వ తేదీన... ప్రియురాలు రమణమ్మకు రాత్రి 9 గంటల తర్వాత ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ వచ్చింది. దీంతో అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఆమె ఇంటికి వచ్చి తలుపు కొట్టాడు. ఆ సమయంలో టీవీ ఆన్ చేసి ఉంది. పెద్ద సౌండ్ తో మోగుతోంది. అదే సమయంలో ఇంటి పక్క నుంచి ఎవరో వ్యక్తి పారిపోయినట్లు అనుమానం వచ్చింది. దీంతో ఎవరు వెళ్ళిపోతున్నారు? ఎందుకు మరో వ్యక్తిని ఇంట్లోకి రానిచ్చావ్? అంటూ రమణమ్మతో రమణ గొడవపడ్డాడు. గట్టిగా కొట్టి.. కాలితో బలంగా తన్నాడు. దీంతో ఆమె తల తలుపు, ద్వారం మధ్యలో ఉన్న కోనును తగిలి కిందపడిపోయింది. 11వ తేదీన బంధువులు ఆస్పత్రిలో చేర్చగా చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతి చెందిన విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు .

విఆర్వో ఎదుట లొంగిపోయిన నిందితుడు..
డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో పరిశీలించగా కుక్క.. సరిగ్గా రమణ ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగింది. నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో ఆ గ్రామ విఆర్వో ఆనందరావు వద్ద మంగళవారం అతడు లొంగిపోయాడు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. ఈ సందర్భంగా రమణమ్మను తానే హత్య చేసినట్లు రమణ అంగీకరించాడు. ఆ తర్వాత నిందితుడిని పోలీసులు రిమాండ్ కు సాలూరు తరలించారు. మూడు రోజుల్లో కేసును చేధించిన సీఐ, ఎస్, పోలీస్ లను ఆ శాఖ ఉన్నతాధికారులు అభినందించారు.