మద్యం లోడ్ వ్యాన్ బోల్తాపడి రోడ్డుపై పడిపోయిన బీరు సీసాల కోసం ప్రజలు ఎగబడ్డ ఘటన అనకాపల్లి జిల్లాలో చోటుచేసుకుంది. 

అనకాపల్లి : ఏదయినా ప్రమాదం జరిగితే ఎవరికి ఏమయ్యిందోనని అందరూ కంగారుపడతారు. కానీ అనకాపల్లి జిల్లాలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం మాత్రం కొందరు మందుబాబుల ఆనందానికి కారణమయ్యింది. మద్యం లోడ్ తో వెళుతున్న వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో రోడ్డుపై పడ్డ మద్యం బాటిల్స్ ను మందుబాబులు అందినకాడికి ఎత్తుకెళ్లారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

వివరాల్లోకి వెళితే... అనకాపల్లి జిల్లా కాశింకోట మండలం బయ్యవరం వద్ద మద్యం లోడ్ తో వెళుతున్న వ్యాన్ ప్రమాదానికి గురయ్యింది. భారీగా బీర్ కేసుల లోడ్ తో జాతీయ రహదారిపై వేగంగా దూసుకెళుతున్న వ్యాన్ అదుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కానీ వ్యాన్ లోని బీర్ సీసాలన్ని రోడ్డుపై పడిపోయాయి. 

వ్యాన్ బోల్తాపడిన సమయంలో కొన్ని సీసాలు పగిలిపోయి మద్యం రోడ్డుపాలయ్యింది. మిగిలిన బీర్ బాటిల్స్ కోసం ఇతర వాహనదారులు, స్థానికులు ఎగబడ్డారు. విషయం తెలియడంతో కేవలం బీరుబాటిల్స్ కోసమే కొందరు మందుబాబులు ప్రమాదస్థలికి చేరుకున్నారు. ఇలా ఎవరికి అందినకాడికి వారు బీరు బాటిల్స్ ఎత్తుకెళ్లారు.

Read More తాత ఆపరేషన్ కు అత్త డబ్బులు పంపితే.. ఆన్ లైన్ గేమ్స్ లో పోగొట్టి.. యువకుడు ఆత్మహత్య...

వ్యాన్ రోడ్డుపైనే బోల్తాపడటంతో ట్రాఫిక్ కు అంతరాయం కలిగింది. వెంటనే స్థానిక పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేసారు. పోలీసులు చేరుకునేసరికే రోడ్డుపై పడిపోయిన బీర్ బాటిల్స్ అన్ని ఖాళీ అయ్యాయి. 

ఇక ఈ ప్రమాదం నుండి వ్యాన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. అతడిని సమీపంలోని ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డ్రైవర్ నుండి వివరాలు సేకరించిన పోలీసులు మద్యం లూటీపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు.