నెలాఖరుతో ముగియనున్న సమీర్ శర్మ పదవీ కాలం.. జవహర్ రెడ్డి వైపు జగన్ మొగ్గు..?
ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం ఈ నెలాఖరుతో ముగియనున్న నేపథ్యంలో కొత్త చీఫ్ సెక్రటరీగా ఎవరినీ ఎంపిక చేయాలనే దానిపై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అయితే సీనియర్ ఐఏఎస్ జవహర్ వైపే జగన్ మొగ్గు చూపినట్లుగా తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ జవహర్ రెడ్డి నియమితులయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుత సీఎస్ సమీర్ శర్మ పదవీకాలం ఈ నెలాఖారుతో ముగియనుంది. దీంతో కొత్త సీఎస్గా జవహర్ నియామకం దాదాపు ఖరారైనట్లుగా ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీనికి సంబంధించి ఒకట్రెండు రోజుల్లో అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం వుంది. 1990 బ్యాచ్ ఏపీ కేడర్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి ... ప్రస్తుతం సీఎం జగన్ వద్ద ప్రత్యేక సీఎస్గా ఆయన విధులు నిర్వర్తిస్తున్నారు.
ALso REad:ఏపీ సీఎస్ సమీర్ శర్మ పదవీ కాలం పొడిగింపు.. ఉత్తర్వులు జారీ
ఇకపోతే.. ఈ ఏడాది మేలో సమీర్ శర్మ పదవీ కాలాన్ని కేంద్రం పొడిగించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆరు నెలల పాటు .. అంటే నవంబర్ 30 వరకు పొడిగించింది. సీఎస్ పదవీ కాలం పెంపుపై డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా.. ఇప్పటికే ఒకసారి సమీర్ శర్మ పదవీకాలాన్ని కేంద్రం పొడిగించింది. నిజానికి గతేడాది నవంబర్ 30తో ఆయన పదవీకాలం ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2022 మే 31 వరకు ఆరు నెలల పాటు సీఎస్ పదవీ కాలాన్ని పొడిగించింది కేంద్రం.