ఎందుకీ మొక్కుబడి దీక్షలు
అందరి సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందన్నది వాస్తవం. సరే, ఏదో అదృష్టం కొద్దీ చంద్రబాబు ముఖ్యమంత్రయ్యారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన వ్యక్తే మళ్ళీ ఇపుడు దీక్షలు చేయటమేంటి?
చంద్రబాబునాయుడు మొక్కుబడి దీక్షలు ఎందుకు చేస్తున్నారో అర్ధం కావటం లేదు. రాష్ట్రం విడిపోవటమన్నది ప్రజలను తీవ్ర నిరాసకు గురిచేసిన మాట వాస్తవమే. అయితే రాష్ట్రం ఎలా విడిపోయింది? ఎవరు కారణం? రాష్ట్ర విభజనను నిశితంగా పరిశీలిస్తే అప్పట్లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను మాత్రమే జనాలు తీవ్రంగా శిక్షించారు. అయితే, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలకు పాత్ర లేదా? వైసీపీ, సిపిఐ కూడా అనుకూలంగానే లేఖలు ఇచ్చాయి కదా?
భాజపా సహకారంలేకుండానే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విడగొట్టిందా? రాష్ట్ర విభజనకు చంద్రబాబు కూడా పూర్తి మద్దతు తెలిపారు కదా? అంటే అందరి సహకారంతోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేసిందన్నది వాస్తవం. సరే, ఏదో అదృష్టం కొద్దీ చంద్రబాబు ముఖ్యమంత్రయ్యారు. రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన వ్యక్తే మళ్ళీ ఇపుడు దీక్షలు చేయటమేంటి? మూడేళ్ళుగా చంద్రబాబు ఇదే హడావుడి చేస్తున్నారు.
ఇంతకీ దీక్షలు ఎందుకుట? రాష్ట్రాన్ని యూపిఏ ప్రభుత్వం ఏకపక్షంగా విభజించేసి ప్రజలను అష్టకష్టాలకు గురి చేసినందుకట. ఏమన్నా అర్ధముందా? ప్రజలకున్న కసిని 2014 ఎన్నికల్లోనే కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఓట్లు వేయటం ద్వారా చూపించారు కదా? అంటే జనాలను ఇంకా విభజన సెంటిమెంట్ తో కొడదామనే?
జూన్ 2వతేదీ నవనిర్మాణదీక్షట, 8వతేదీ మహాసంకల్ప దీక్షట. ఏంటో చంద్రబాబు మాటలు సామాన్యులకు ఓపట్టాన అర్ధం కాదు. వారం రోజుల పాటు రోజుకో దీక్ష చేయాలట. మొదటి సంవత్సరంలోనే జనాలనుండి దీక్షలకు స్పందన లేదు. ఎవరి ఇంటిని చక్కదిద్దుకోవటానికే వారికి సమయం సరిపోక అవస్తలు పడుతుంటే ప్రతీ ఏడాది దీక్షల కోసం జనాలు రోడ్లపైకి వస్తారా? పార్టీ నేతలు, కార్యకర్తలే మొక్కుబడి దీక్షలు చేస్తుంటే జనాలెందుకు చేస్తారు దీక్షలు. పొలిటికల్ జిమ్మిక్కులు చంద్రబాబుకు అవసరం కానీ జనాలకు కాదు కదా?