తెలంగాణలో టీఆర్ఎస్ చేసిన పనే ఇప్పుడు ఆంధ్రాలో టీడీపీ చేసింది. అప్పుడు ప్రశ్నించిన జనసేన అధినేత ఇప్పుడు మౌనంగా ఉంటే ఎట్లా.. ప్రశ్నించడం లేటు అయినా ఫర్వాలేదు  కానీ కచ్చితంగా ప్రశ్నించాలి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ స్పందించాల్సిన తరుణం ఆసన్నమైంది. తన మిత్రపక్షం తన భావజాలానికి భిన్నంగా వెళుతుంటే గర్జించాల్సిన సమయం వచ్చేసింది. మరి గడ్డం గీసుకోని ఈ సింహం స్పందిస్తుందా ? లేదా సైలెంట్ అవుతుందా..?

లేకపోతే పాచిపోయిన లడ్డూ లాంటి ట్వీట్లు చేసి మమ అనిపిస్తుందా ? ... వేచి చూడాలి.

గతంలో తెలంగాణలో అధికార టీఆర్ఎస్ పార్టీ ఆపరేషన్ ఆకర్ష పేరుతో టీడీపీ కి చెందిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ను పార్టీలోకి లాగింది. మంత్రి పదవిని కట్టబెట్టింది. తెలంగాణ ఉద్యమంలో ఒక్కసారి కూడా పాల్గొనని ఆయన తెలంగాణ మంత్రివర్గంలో చేరడం నిజంగా వింతే. తెలంగాణ ప్రజలు కూడా ఈ విషయంలో తలసాని యాదవ్ పై పెద్దగా విమర్శలు చేయలేదు.

అయితే జనసేన అధినేత పవన్ మాత్రం టీఆర్ఎస్ పార్టీ వైఖరిపై, తలసాని తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. తన మిత్రపక్షానికి చెందిన ఎమ్మెల్యేను టీఆర్ఎస్ అలా లాగేసుకోవడం పాపం ఆయనను బాగా బాధించి ఉంటుంది.

అందుకే ‘ టీఆర్ఎస్ తలసానిని తన పార్టీలోకి లాగొచ్చు కానీ, ఆయన ప్రాతినిథ్యం వహించిన సనత్ నగర్ ప్రజల నమ్మకాన్ని గెలుచుకోగలదా‘ అని పవన్ ప్రశ్నించారు.

ఇప్పుడు కూడా పవన్ ప్రశ్నంచాల్సిన సమయం వచ్చేసింది. ఏపీ లో టీడీపీ కూడా ఇప్పుడు తెలంగాణలో టీఆర్ఎస్ చేసిన పనే చేసింది. వైసీపీ నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలను తన వైపు లాగి మంత్రి పదవులు కట్టబెట్టింది.

కాబట్టి ప్రశ్నించడానికే పార్టీ పెట్టిన జనసేన అధినేత దీన్ని కచ్చితంగా ప్రశ్నించాలి. ప్రశ్నించడం లేటైనా ఫర్వాలేదు కానీ, పక్కాగా ప్రశ్నించాలి.