పరకాల ప్రభాకర్ రాజీనామాకు కారణమిదీ: జగన్ ఏమన్నారు?
పరకాలపై విమర్శల వెనుక
అమరావతి: ఎన్డీఏ నుండి టిడిపి బయటకు వచ్చిన తర్వాత ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహదారుగా ఉన్న పరకాల ప్రభాకర్ ను లక్ష్యంగా చేసుకొని వైసీపీ నేతలు ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ విమర్శల నేపథ్యంలో పరకాల ప్రభాకర్ తన పదవికి రాజీనామా చేస్తూ నిర్ణయం తీసుకొన్నారు.
కొంతకాలంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడుగా కొనసాగుతున్న పరకాల ప్రభాకర్ ప్రభుత్వ వ్యవహరాల్లో గతంలో ఉన్నట్టుగా చురుకుగా పాల్గొనడం లేదనే ప్రచారం కూడ లేకపోలేదు. ఏపీ రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం నుండి వస్తున్న విమర్శలను దృష్టిలో ఉంచుకొని ఆయన ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనడం లేదనే వాదన కూడ లేకపోలేదు.
ఏపీ రాష్ట్రంలో టిడిపి, వైసీపీల మధ్య ఇటీవల కాలంలో తీవ్ర స్థాయిలో మాటల యుద్దం సాగుతోంది. టిడిపి మళ్ళీ ఎన్డీఏలో చేరే అవకాశం లేకపోలేదని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఏపీలో బిజెపితో విరోధం, ఢిల్లీలో అంతర్గతంగా బిజెపితో సఖ్యతను పాటిస్తున్నారని వైసీపీ నేతలు టిడిపిపై విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ విమర్శల్లో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సలహదారుడిగా ఉన్న పరకాల ప్రభాకర్ సహయంతో బిజెపితో టిడిపి నేతలు బిజెపితో అంతర్గతంగా సంబంధాలను కొనసాగిస్తున్నారని బిజెపి నేతలు ఆరోపిస్తున్నారు. పరకాల ప్రభాకర్ సతీమణే కేంద్ర రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్ .
అయితే కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ సహయంతో టిడిపి నేతలు బిజెపితో సత్సంబంధాల కోసం ప్రయత్నాలను చేస్తున్నారని వైసీపీ నేతలు ప్రశ్నించారు. అంతేకాదు టిటిడి బోర్డు సభ్యురాలిగా మహారాష్ట్రకు చెందిన బిజెపికి చెందిన ఓ మంత్రి భార్యను ఎందుకు చేర్చారని వైసీపీ నేతలు ప్రశ్నించారు.
ప్రజా సంకల్పయాత్రలో భాగంగా వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ కూడ ఇటీవల కాలంలో నిర్మలా సీతారామన్, పరకాల ప్రభాకర్ గురించి విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ తో పాటు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ కూడ ఇవే రకమైన విమర్శలు గుప్పించారు.
ఇటీవల కాలంలో వైసీపీ నేతలు చేస్తున్న వ్యక్తిగత విమర్శలతో పరకాల ప్రభాకర్ మనోవేదనకు గురైనట్టు సీఎంకు పంపిన లేఖలో పేర్కొన్నారు. టిడిపిని లక్ష్యంగా చేసుకొని వైసీపీ నేతలు చేసే విమర్శలకు పరకాల ప్రభాకర్ ను కేంద్రంగా చేసుకొన్నారు. పరకాల ప్రభాకర్ కేంద్రంలోని బిజెపితో నేతలతో మంచి సంబంధాల కోసం కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ద్వారా రాయబారాలు నడుపుతున్నారనే రీతిలో వైసీపీలో విమర్శలు గుప్పించారు.
ఏపీ రాష్ట్ర ప్రభుత్వ మీడియా సలహాదారు పరకాల ప్రభాకర్ ను కేంద్రంగా చేసుకొని వైసీపీ నేతలు చేసిన విమర్శలు రాజకీయంగా టిడిపిని ఇబ్బందికి గురిచేశాయి. అంతేకాదు వ్యక్తిగతంగా పరకాల ప్రభాకర్ ఈ విమర్శలతో మనోవేదన చెందాడు. ఈ కారణంగానే ఆయన తన పదవికి రాజీనామా చేయాలనే నిర్ణయం తీసుకొన్నాడు. .