చంద్రబాబుపై నక్సలైట్ల దాడి సమయంలో కారుపైకి ఎక్కిన అంజూ యాదవ్.. ఇప్పుడేమో చుట్టూ వివాదాలు..!!
శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్.. గత కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. ఇందుకు కారణం ఆమె పలువురి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కారణం.

శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్.. గత కొంతకాలంగా వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. ఇందుకు కారణం ఆమె పలువురి పట్ల దురుసుగా ప్రవర్తించడమే కారణం. తాజాగా జనసేన నాయకుడు సాయిపై ఆమె చేయి చేసుకోవడంతో మరోసారి వార్తల్లో నిలిచారు. ఈ క్రమంలోనే ఆమెపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది. అయితే ఈ పరిణామాల వేళ అంజూ యాదవ్ గురించిన ఆసక్తి కర కథనం.. ఇప్పుడు చర్చల్లో నిలిచింది.
2003లో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు కాన్వాయ్పై నక్సలైట్లు క్లైమోర్ మైన్స్ పేల్చిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటనకు అంజూ యాదవ్ ప్రత్యక్ష సాక్షిగా ఉన్నారు. చంద్రబాబు కాన్వాయ్లో ముందు వెళ్తున్న లీడ్ కారులో ఆమె ఉన్నారు.
చంద్రబాబు వాహనం బ్లాస్ట్ అయిన కొద్ది నిమిషాల్లోనే.. అంజూ యాదవ్ వెంటనే వచ్చి కారుపైకి ఎక్కారు. అక్కడి పరిస్థితిని అర్థం చేసుకుని మిగిలిన వారితో కలిసి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. సూపర్ పోలీసుగా పేరు తెచ్చుకున్నారు. అప్పుడు ఆమె చిత్తూరు జిల్లాలో ఎస్ఐగా విధుల్లో నిర్వర్తిస్తున్నారు. ఇదే విషయాన్ని కొన్నేళ్ల క్రితం అంజూ యాదవ్ ఓ ఇంటర్వ్యూలో కూడా వెల్లడించారు. తాను ఎస్ఐగా చేస్తున్న సమయంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పర్యటనల్లో(చిత్తూరు) తనకు చాలా వరకు డ్యూటీ వేసేవారు అని చెప్పారు.
‘‘ఆరోజు చంద్రబాబు నాయుడుకు సంబంధించిన చాలా కార్యక్రమాలు ఉన్నాయి.. స్విమ్స్లో ప్రోగ్రామ్ సాయంత్రం 4 గంటలకు అయిపోయింది.. అక్కడి నుంచి తిరుమల కొండకు వెళ్లాల్సి ఉంది. సాయంత్రం 4.05 నిమిషాలకు కాన్వాయ్ బయలుదేరింది. లీడ్ కారులో కొందరు అధికారులతో పాటు నేడు. గరుడ దగ్గర వెహికల్ పాస్ అయిందో? లేదో? చూడమని చెప్పడంతో వెనక్కి తిరిగి చూసే సరికి.. ఒక్కసారి బ్లాస్ అయిన దృశ్యం కనిపించింది. ’’ అని అంజూ యాదవ్ పేర్కొన్నారు.
ఆ తర్వాత వెంటనే అధికారులు అందరూ పొజిషన్ తీసుకున్నారని చెప్పారు. తాను ఆ సమయంలో తన వద్ద వెపన్ ఉన్నప్పటికీ ఫైర్ ఓపెన్ చేయలేదని తెలిపారు. అయితే అప్పుడు తనతో పాటు కారులో ఉన్న హెడ్ కానిస్టేబుల్ వారించినప్పటికీ తాను వినలేదని.. వెంటనే పరిగెత్తి అక్కడికి చేరుకున్నానని తెలిపారు. అక్కడికి వెళ్లి కారు ఎక్కి చూశానని తెలిపారు. మిగిలినవారు కూడా అక్కడికి వచ్చి.. కారులో నుంచి అందరిని బయటకు తీసి అంబులెన్స్లో తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. ఆ ఘటనను ఇప్పుడు తలచుకుంటే భయమేస్తుందని.. అప్పుడు చాలా చాలెజింగ్ అనిపించిందని అన్నారు.
అయితే ఇప్పుడు మాత్రం.. అంజూ యాదవ్ కాంట్రావర్సీలకు కేరాఫ్గా మారారు. ఏపీలో జరిగిన గత స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అధికార వైసీపీకి అనుకూలంగా వ్యవహరించారనే ఆరోపణలు ఆమెపై ఉన్నాయి. టీడీపీ నేత బొజ్జల సుధీర్ దురుసుగా వ్యవహరించారంటూ టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగారు.
ఇక, శ్రీకాళహస్తిలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద సీఎం జగన్ దిష్టిబొమ్మ దహనానికి టీడీపీ నేతలు ప్రయత్నించగా టీఎన్ఎస్ఎఫ్ నాయకుడు కోబాకు లక్ష్మణ్పై సీఐ చేయి చేసుకున్నారని ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశాయి.
గతేడాది శ్రీకాళహస్తిలో ఓ హోటల్ యజమానురాలిని సీఐ అంజు యాదవ్ బలవంతంగా పోలీస్ జీప్ ఎక్కిస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ‘‘రాత్రి 10 గంటలు కూడా కానప్పటికీ ఆమె నా హోటల్లోకి దూసుకెళ్లి.. నా భర్త ఆచూకీ చెప్పమని నాతో వాగ్వాదానికి దిగింది. నా కొడుకు నన్ను విడిచిపెట్టమని వేడుకుంటున్నప్పటికీ.. వివరించలేని విధంగా నాపై దాడి చేసింది. సర్జరీ తర్వాత కోలుకున్న నన్ను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి మరోసారి తీవ్రంగా కొట్టింది. ఆమె బూట్ గుర్తులు నా మెడపైనా, పొట్టపైనా, శరీరంపైనా ఇప్పటికీ కనిపిస్తున్నాయి’’ అని బాధితురాలు ఆరోపించింది.
ఇక, తాజాగా జనసేన నేత సాయిపై అంజూ యాదవ్ చేయి చేసుకోవడం.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో ఆమె మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. అయితే అంజూ యాదవ్కు వైసీపీ పెద్దల అండదండలు ఉన్నాయని.. అందుకే ఆమెపై సరైన చర్యలు ఉండటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.