తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ప్రకటించారు.


కడప:  తాము అధికారంలోకి వస్తే డ్వాక్రా సంఘాల రుణాలను మాఫీ చేస్తామని వైసీపీ చీఫ్ వైఎస్ జగన్  ప్రకటించారు. వడ్డీ లేని రుణాలను అందిస్తామన్నారు.

గురువారం నాడు కడపలో జరిగిన సమరశంఖారావం సభలో  ఆయన పాల్గొన్నారు. రైతులకు ప్రతి ఏడాది మే మాసంలో 12,500 ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ స్కూళ్లలో చదివే పిల్లలకు ప్రతి ఏటా రూ.15 వేలు చెల్లించనున్నట్టు చెప్పారు.  ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ మహిళలకు  ఏడాదికి రూ. 75వేలు ఇవ్వనున్నట్టు జగన్ హామీ ఇచ్చారు.

ఎన్నికలు వస్తున్నందున  చంద్రబాబునాయుడు రోజకో మాట చెబుతూ ప్రజలను  నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఐదేళ్ల కాలంలో  చంద్రబాబునాయుడు ఇచ్చిన  హామీలను  అమలు చేయలేదన్నారు.  ఈ ఐదేళ్లలో రాష్ట్రాన్ని దోచుకొన్నాడన్నారు. 

గత పదేళ్లుగా  మీరు పడిన కష్టాలన్నీ తనకు తెలుసునని చెప్పారు. రాష్ట్రాన్ని ఐదేళ్లలో అడ్డంగా దోచుకొన్నారని జగన్ విమర్శలు గుప్పించారు.అధికారంలోకి వచ్చిన నాటి నుండి చంద్రబాబునాయుడు ప్రజలకు  సినిమాలను చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.