విశాఖకు రైల్వేజోన్: తేల్చేసిన కన్నా లక్ష్మీనారాయణ
విశాఖలో రైల్వేజోన్ ఇస్తామని రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటించినా.. టీడీపీ నేతలు కేంద్రం సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
అమరావతి: విశాఖలో రైల్వేజోన్ ఇస్తామని రాజ్యసభలో కేంద్రమంత్రి ప్రకటించినా.. టీడీపీ నేతలు కేంద్రం సుప్రీంకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఏపీ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు.
సోమవారం నాడు అమరావతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. విశాఖకు రైల్వేజోన్ ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ చెప్పారు. రాజ్యసభలో విశాఖలో రైల్వేజోన్ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. కానీ, రైల్వేజోన్ ఇవ్వడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు.
సుప్రీంకోర్టులో కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లు ఆ సమయంలో ఉన్న పరిస్థితులకు అనుగుణంగా దాఖలు చేసినట్టు ఆయన చెప్పారు. రైల్వేజోన్ ఇవ్వడం అనేది రాజకీయ నిర్ణయమని ఆయన చెప్పారు. రైల్వేజోన్కు అనుకూలంగా కేంద్రం నిర్ణయం తీసుకొంటామని చెప్పినా కానీ తప్పుడు ప్రచారం ఎందుకు చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు.
అధికార పార్టీ నేతలతో పాటు కొన్ని పత్రికలు కూడ తమ పార్టీపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. ఈ ప్రచారాన్ని మానుకోవాలని ఆయన సూచించారు. ఏపీ రాష్ట్రాభివృద్ధికి తమ పార్టీ కట్టుబడి ఉందన్నారు. తన అనుభవాన్ని ఏపీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసేందుకు చంద్రబాబునాయుడు ప్రయత్నిస్తున్నారని కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు.
ఏపీ విషయంలో ఎన్నో సార్లు చంద్రబాబునాయుడు యూ టర్న్ తీసుకొన్నారని ఆయన మండిపడ్డారు. చంద్రబాబుతో చర్చకు తాను సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు. ఏపీకి ఇచ్చిన హామీలను అమలు చేస్తామన్నారు.