ఎన్ని అడ్డంకులొచ్చినా 2019 డిసెంబర్ నాటికి పోలవరం పూర్తి: బాబు
వైసీపీపై బాబు విమర్శలు
ఏలూరు: ఎవరెన్ని అడ్డంకులు సృష్టించిన పోలవరం ప్రాజెక్టును 2019 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన ధ్యేయమన్నారు.
సోమవారం నాడు ఆయన పశ్చిమగోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు వద్ద పోలవరం డయా ఫ్రం వాల్ పైలాన్ ను చంద్రబాబునాయుడు ఆవిష్కరించారు. డయా ఫ్రం వాల్ ను ఆయన జాతికి అంకితమిచ్చారు.ఈ సందర్భంగా అధికారులతో బాబు సమీక్షించారు. ఆ తర్వాత ఆయన పోలవరం ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. రూ.450 కోట్లతో రూ.1400 మీటర్ల డయాఫ్రం వాల్ ను నిర్మించినట్టుగా ఆయన చెప్పారు.ఒకే రోజు 13 వేల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనిని పూర్తి చేసినట్టుగా ఆయన చెప్పారు. మరోవైపు ఒకే రోజు సుమారు 60 వేల సిమెంట్ బస్తాలను ఉపయోగించినట్టుగా ఆయన గుర్తు చేశారు.
పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయడమే తన జీవితాశయంగా ఆయన పేర్కొన్నారు. పట్టిసీమతో కృష్ణా డెల్టాకు నీరిచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో కరువును శాశ్వతంగా పారదోలుతామని ఆయన చెప్పారు. కృష్ణా, గోదావరి, పెన్నా , వంశధార, నాగావళి నదులను అనుసంధానం చేయనున్నట్టు ఆయన చెప్పారు.