ఏపీ అభివృద్దికి బీజేపీ కట్టుబడి ఉంది: పురంధేశ్వరీ
ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరీ చెప్పారు.
అమరావతి: ఏపీ రాష్ట్రానికి ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు బీజేపీ కట్టుబడి ఉందని మాజీ కేంద్ర మంత్రి, బీజేపీ నేత పురంధేశ్వరీ చెప్పారు.
బీజేపీ నేత, మాజీ కేంద్ర మంత్రి పురంధేశ్వరీ మంగళవారం నాడు అమరావతిలో మీడియాతో మాట్లాడారు.పోలవరం ప్రాజెక్టు సవరించిన డీపీఆర్కు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు.ఆర్థిక శాఖ నుండి ఆమోదం వచ్చిన తర్వాత కేంద్రం నుండి నిధులు వస్తాయన్నారు.
దేశంలో పేదల కోసం మోడీ ప్రభుత్వం అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. నోట్ల రద్దు కార్యక్రమం వల్ల నల్లధనాన్ని తగ్గించగలిగినట్టు చెప్పారు.నోట్ల రద్దు వల్ల మూడున్నర లక్షల డొల్ల కంపెనీలు మూతపడ్డాయని ఆమె చెప్పారు.
గ్రామీణాభివృద్ధికి పెద్దపీట వేసినట్టు ఆమె చెప్పారు. ఈ పథకం కింద పెద్ద ఎత్తున నిధులను కేంద్రం విడుదల చేసినట్టు ఆమె చెప్పారు. దేశం సంక్షేమం కోసం పాటు పడినందుకు మోడీని గద్దెదించుతారా అని ఆమె విపక్షాలను ప్రశ్నించారు.ఏపీలో ప్రధాని పర్యటనకు ముఖ్యమంత్రితో పాటు మంత్రులు రాకపోవడం దారుణమన్నారు.