ఏపీలోని విజయనగరం జిల్లాలో ఓ వలంటీర్ అత్యుత్సాహంతో మరణించిన మహిళకు పింఛన్ మంజూరు చేశారు. దీంతో గ్రామంలోని ప్రజలు అందుకు అభ్యంతరం చెప్పారు.

విజయనగరం: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో వలంటీర్ల అత్యుత్సాహానికి అంతేలేకుండా పోతోంది. ఏకంగా చనిపోయిన మహిళకు కూడా పింఛన్ మంజూరు చేశారు. ఈ ఘటన రాష్ట్రం వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. 

జిల్లాలోని గుర్ల మండలం గుర్ల గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామంలో ఇజ్జిరోతు త్రీనాథ్ అనే వ్యక్తి వలంటీర్‌గా పనిచేస్తున్నాడు. గ్రామంలో ఎర్ర నారాయణ అనే మహిళ చనిపోయింది. అయితే చనిపోయిన మహిళ దగ్గర వేలిముద్ర తీసుకుని ఆమెకు ఫించన్‌ను వలంటీర్ పంపిణీ చేశాడు. దీంతో గ్రామస్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 

అధికారుల మెప్పు కోసమే వలంటీర్లు ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా డీఆర్‌డీఏ పీడీ సుబ్బారావు స్పందించారు. ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత వారి వేలిముద్రలు పనిచేయవని సుబ్బారావు తెలిపారు. ఘటనపై విచారణకు పీడీ ఆదేశించారు. గుర్ల ఎంపీడీవో‌ను విచారణ అధికారిగా పీడీ నియమించారు.